మంగపేట : ములుగు జిల్లా మంగపేట సమీపంలోని సండ్రోనిఒర్రె అటవీ ప్రాంతంలో గత నెల 28న భారీ సుడిగాలికి వందకు పైగా భారీ వృక్షాలు నేలమట్టమైన విషయం తెలిసింది. ఈ ప్రాంతాన్ని మంగళవారం అటవీశాఖ కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్.. డీఎఫ్ఓ వికాస్ మీనాతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సుడిగాలికి నేలమట్టమైన భారీ వృక్షాలతో పాటు యూకలిప్టస్ ప్లాంటెన్లో పడిపోయిన చెట్లను గుర్తించి నంబరింగ్ ఇచ్చిన వివరాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు అరుదుగా జరుగుతాయన్నారు. ఎక్కువ వయసు కలిగి బలహీనంగా ఉన్న చెట్లు పడిపోయినట్లు తెలిపారు. సాధారణ విజిట్లో భాగంగా విషయం తెలిసి ఇక్కడకు వచ్చినట్లు ఆయన తెలిపారు. ఎఫ్డీఓ వజ్రారెడ్డి, మంగపేట ఇన్చార్జ్ రేంజ్ అధికారి లాయక్ హుస్సేన్, ఎఫ్బీఓ రవీన్, జ్యోతి, శ్రీకాంత్, తామ్సన్, పుణ్యలత, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.


