కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ విభాగం, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ), స్టేట్ ఎక్స్ఫర్ట్ అప్రయిజల్ కమిటీ(ఎస్ఈఏసీ) తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 12, 13 తేదీల్లో సెనెట్హాల్లో రెండు రోజులపాటు జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, సదస్సు నిర్వహణ కమిటీ చైర్మన్ తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ అప్పిలెట్ అథారిటీ సభ్యుడు ప్రొఫెసర్ గాదె దయాకర్ తెలిపారు. సోమవారం కెమిస్ట్రీ విభాగంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ‘సినర్జిసింగ్ ఇనిస్టిట్యూషన్స్ ఫర్ సస్టేయినబుల్ డెవలప్మెంట్ స్ట్రాటజిక్ అండ్ మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ టూ పొల్యూషన్ కంట్రోల్’ అనే అంశంపై ఈ సదస్సును నిర్వహించనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, స్థిరమైనఅభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు, పరిశోధనా సంస్ధలు విద్యాసంస్థల మధ్య సమన్వయ బలోపేతం చేయడంలో భాగంగా ఈసదస్సులో చర్చలు జరుగుతాయన్నారు. ఈనెల 12న సదస్సుకు ముఖ్య అతిథిగా కేయూ వీసీ ఆచార్య ప్రతాప్రెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ వీసీ ఆచార్య రవీంద్రనాథ్ ప్రారంభోపాన్యాసం చేస్తారని తెలిపారు. జీడిమెట్ల జేఈటీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బక్కారెడ్డి, హైదరాబాద్ టీఎస్డీఎఫ్ ప్రాంతీయ అధిపతి డాక్టర్ రాధాకృష్ణసాయి, హిటెరో డ్రగ్స్ సీనియర్ జనరల్ మేనేజర్ డాక్టర్ ఈహెచ్ఎస్ హరి ప్రొఫెసర్ పీవీ రావు, ఆచార్య శ్రీధర్ ప్రసంగిస్తారని తెలిపారు. ఈనెల 13న జరిగే సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శి జి.రవి, మాజీ సభ్యకార్యదర్శి డాక్టర్ సెన్గుప్తా, రాష్ట్ర ప్రధాన సమాచార శాఖ కమిషనర్ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి, భారత ప్రభుత్వశాస్త్రవేత్త డాక్టర్ సుందర్రామనాథన్, రాష్ట్ర ప్రధాన అటవీశాఖ సంరక్షణాధికారి డాక్టర్ ప్రియాంక వర్గీస్, తెలంగాణ పోల్యూషన్ కంట్రోల్ అప్పిలేట్ అథారిటీ చైర్మన్ జస్టిస్ సాంబశివరావునాయుడు, రాష్ట్ర ఎక్స్ఫర్ట్ అప్రైయిజల్ చైర్మన్ డాక్టర్ రాంగోపాల్రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సుకు ఇప్పటికే దేశంలో వివిధ యూనివర్సిటీలు, వివిధ పరిశ్రమలు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు 150మంది నమోదు చేసుకున్నారని వెల్లడించారు. విలేకరుల సమావేశంలో కెమిస్ట్రీ విభాగం అధిపతి ఆచార్య వాసుదేవరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మమత తదితరులు పాల్గొన్నారు.
విలేకరుల సమావేశంలో వెల్లడించిన రిజిస్ట్రార్ రామచంద్రం


