కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈఏడాది మే లో నిర్వహించిన డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల్లో నిర్వహించిన మొదటి, రెండో, మూడో, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను సోమవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్తో కలిసి విడుదల చేశారు. మొ దటి సెమిస్టర్లో 25,461మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 7,112మంది (27.93శాతం) ఉత్తీర్ణత సాధించారు. రెండో సెమిస్టర్లో 50,292 మందికి 16,386 మంది (32.58శాతం) ఉత్తీర్ణత సాధించారు. మూడో సెమిస్టర్లో 18,286 మందికి 6,991మంది (38.23శాతం) ఉత్తీర్ణత సాధించారు. నాల్గవ సెమిస్టర్లో 38,033మందికి 14,619మంది విద్యార్థులు (38.44శాతం) ఉత్తీర్ణత సాధించారని పరీక్షల నియంత్రణాధికారి రాజేందర్ వెల్లడించారు. విద్యార్థులు తమ ఫలితాలను డబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్ లో చూసుకోవచ్చని తెలి పారు. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు డాక్టర్ తిరుమలాదేవి, డాక్టర్ వెంకటయ్య, డాక్టర్ నాగరాజు, డాక్టర్ పద్మజ, డాక్టర్ ఆసిం ఇక్బాల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రామావెంకటేశ్వర్లు, నాయకపు సమ్మయ్య పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. రీవాల్యూయేషన్ కోసం విద్యార్థులకు 15 రోజుల అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆన్లైన్లో నిర్దేశిత ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బీఏ జర్నలిజం ఫలితాలు వెల్లడించలేదు..
ఇదిలా ఉండగా.. బీఏ జర్నలిజం పేపర్ (ఒక సబ్జెక్టు)కు సంబంధించిన ఫలితాలను సాంకేతిక కారణాలతో వెల్లడించలేదని పరీక్షల నియంత్రణాధి కారి రాజేందర్ తెలిపారు. మరో రెండు, మూడు రోజుల్లోనే వెల్లడిస్తామన్నారు. అలాగే యూనివర్సిటీ పరిధిలో తొమ్మిది డిగ్రీ కళాశాలలకు చెందిన విద్యార్థుల మొదటి, రెండు, మూడు, నాల్గో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను నిలిపివేశామని తెలిపారు. ఆయా కళాశాలలు యూనివర్సిటీకి చెల్లించాల్సిన (సీడీసీడీన్, అకాడమిక్ డీన్ ఆఫీస్లకు) వివిధ ఫీజులు చెల్లించలేదని దీంతో ఫలితాలను నిలిపివేసినట్లు రాజేందర్ స్పష్టం చేశారు. ఆయా ఫీజులు చెల్లిస్తేనే ఫలితాలను విడుదల చేస్తామన్నారు.


