వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం ఉదయం ప్రారంభించిన ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి బాల్బ్యాడ్మింటన్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ ఎంపిక పోటీలు సాయంత్రం ముగిశాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ఉమ్మడి జిల్లా జట్టును ఎంపిక చేయనున్నట్లు అడ్హక్ కమిటీ కన్వీనర్ రవీందర్కుమార్ తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెల 8, 9 తేదీల్లో వనపర్తిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఆయన పేర్కొన్నారు. అసోసియేషన్ జిల్లా అడ్హక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి వీవీ రమణ, పరిశీలకులు బంగారు రాజన్న, అసోసియేషన్ బాధ్యులు పాల్గొన్నారు.
రూ. 62,670 విలువైన మద్యం పట్టివేత
సంగెం : వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో బెల్టుషాపుల్లో విక్రయిస్తున్న రూ. 62,670 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సిబ్బంది ఆదివారం దాడులు చేయగా గ్రామానికి చెందిన గుర్రం సాంబయ్య కిరాణాషాపులో రూ.36,530, చెవ్వ బాలయ్య కిరాణాషాపులో రూ. 17,560, చెవ్వ మొగిళి కిరాణాషాపులో రూ. 8,580.. మొత్తం రూ. 62,670 విలువైన మద్యం స్వాధీనం చేసుకుని నిర్వాహకులను తదుపరి చర్యల నిమిత్తం సంగెం పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ సీఐ పెండ్యాల దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
గుడ్లగూబను
పోలిన వింత చేప!
చిన్నగూడూరు: గుడ్లగూబను పోలి ఉన్న వింత చేప ఓ వ్యవసాయ బావిలో లభ్యమైన ఘటన మండలంలోని విస్సంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. విస్సంపల్లి గ్రామానికి చెందిన రైతు ఈరబోయిన సుధాకర్ ఆదివారం వ్యవసాయ బావి నుంచి పొలానికి నీళ్లు పారిస్తున్న క్రమంలో లభించినట్లు తెలిపాడు. వర్షాభావ పరిస్థితుల కారణంగా బావిలో నీరు అడుగంటడంతో చేప కనిపించింది. వెంటనే బావిలోకి దిగి వింత చేపను చాకచక్యంతో పట్టుకున్నాడు. అరుదుగా కనిపించే ఈ చేపను స్థానికులు రాక్షసి చేపగా పిలుస్తున్నారు.
విద్యుత్ మోటారు చోరీ
దంతాలపల్లి: విద్యుత్ మోటారు చోరీకి గురికావడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై రవికుమార్ ఆదివారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సోమారపు కవితకు చెందిన వ్యవసాయ భూమి వద్ద ఉన్న విద్యుత్ మోటార్ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికుమార్ పేర్కొన్నారు.


