ఈ వానాకాలంలో
సాగు అంచనా(ఎకరాల్లో)
పంట గత ఏడాది ఈ వానాకాలం
సాగు (అంచనా)
పత్తి 1,06,674 1,01,716
వరి 2,30,723 2,35,163
మొక్కజొన్న 66,208 73,760
మిర్చి 31,423 38,819
పప్పుదినుసులు 1,353 2,100
ఆయిల్పామ్ 7,904 8,676
ఇతరపంటలు 2,065 17,487
మొత్తం 4,46,350 4,77,721
బయ్యారం: పంటల సాగుల విత్తనం ఎంపిక కీలకం. అయితే మార్కెట్లో అసలుతో పాటు నకిలీ విత్తనాల బెడద ఎక్కువైంది. కాగా, ఏటా నకిలీ విత్తనా లు అని తెలియక నాటిన రైతులు నష్టపోతున్నారు. ఈమేరకు నకిలీ విత్తనాలు రైతుకు చేరకుండా వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ అధికారులతో కూడిన టాస్క్ఫోర్స్ బృందం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల్లోని విత్తనదుకాణాల్లో సోదాలు నిర్వహిస్తూ డీలర్లకు పలు సూచనలు చేస్తున్నారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తుల నుంచి విత్తనాలు కొనుగోలు చేయొద్దని, అలాంటి వ్యక్తుల సమాచారం తమకు అందజేయాలని అధి కారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
బిల్లుతో పాటు ప్యాకెట్ భద్రపర్చుకుంటే మేలు..
విత్తనాలను కొనుగోలు చేసిన రైతులు సంబంధిత డీలర్ల నుంచి తప్పనిసరిగా బిల్లును తీసుకోవాలి. అలాగే విత్తన ప్యాకెట్లను పంట దిగుబడి వచ్చే వరకు భద్రపర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల విత్తనాలు మొలకెత్తకున్నా, మొలకెత్తిన విత్తనాలు పూత, కాత లేకపోతే సంబంధిత డీలర్, కంపెనీ నుంచి రైతులకు నష్టపరిహారం అందుతుంది.
పెరగనున్న మిర్చి, మొక్కజొన్న, వరి,
ఇతర పంటల సాగు..
జిల్లా వ్యాప్తంగా గత ఏడాది వానాకాలంలో సాగు చేసిన పంటల్లో ఈఏడాది మిర్చి, మొక్కజొన్న, వరి, పప్పుదినుసులు, ఆయిల్పామ్, కూరగాయలు, పండ్లతోటల సాగు పెరుగుతుందని వ్యవసాయశాఖాధికారులు అంచనా వేశారు. పత్తి పంట గత ఏడాది కంటే తక్కువ ఎకరాల్లో సాగు జరిగే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
రైతులు సహకరించాలి
నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రెవెన్యూ, పోలీస్శాఖ సహకారంతో తనిఖీలు నిర్వహిస్తున్నాం. క్షేత్రస్థాయిలో అనుమతి లేకుండా ఎవరైనా విత్తనాలు విక్రయిస్తే సంబంధిత వ్యక్తుల సమాచారం అందజేసేందుకు రైతులు సహకరించాలి.
– రాజు, ఏఓ, బయ్యారం
విత్తన దుకాణాల్లో అధికారుల తనిఖీలు
వానాకాలంలో 4,77,721 ఎకరాల్లో సాగు అంచనా


