భూపాలపల్లి రూరల్ : మందు పెడుతుందనే అనుమానంతో భార్యను హత్య చేసిన ఘటన జయశంకర్ జిల్లా భూపాలపల్లి మండలం పెద్దాపూర్లో గురువారం రాత్రి జరిగింది. గ్రామస్తులు..ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన గోదారి సమ్మయ్య, అతడి భార్య సంధ్య (40) దాంపత్య జీవితం ప్రారంభంలో సాఫీగా సాగింది. అయితే కొంతకాలం తర్వాత కుటుంబ కలహాలు మొదలయ్యాయి. సంధ్య తనకు మందు పెడుతుందనే అనుమానం సమ్మయ్యలో అనుమానానికి కారణమైంది. దీంతో తరచూ గొడవలు జరగగా సంధ్య కొంతకాలంగా మండలంలోని ఆముదాలపల్లి గ్రామంలో పుట్టింట్లో నివసిస్తోంది. అయితే ఇటీవల పెద్దల సమక్షంలో సమ్మయ్య భార్యను తిరిగి ఇంటికి తీసుకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలో మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త గురువారం రాత్రి గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. హత్య అనంతరం సమ్మయ్య నేరుగా వెంకటాపురం పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతురాలి సోదరుడు సుధాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్యను హత్య చేసిన భర్త..


