డోర్నకల్ : ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో సబార్డినేట్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. డోర్నకల్ ఎస్సై గడ్డం ఉమ కథనం ప్రకారం.. అమ్మపాలెం గ్రామానికి చెందిన ఎస్కే జమాల్ (45) పీహెచ్సీలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఆఫీస్ సబార్డినేట్గా విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం పీహెచ్సీ వద్ద పురుగు మందు తాగి ఇంటికి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న జమాల్ పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం డోర్నకల్ పీహెచ్సీకి తీసుకు వచ్చారు. పీహెచ్సీలో పూర్తిస్థాయి వైద్యం చేసే అవకాశాలు లేకపోవడంతో 108వాహనంలో మహబూబాబాద్ తరలించే ప్రయత్నాలు చేస్తుండగా జమాల్ మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే అప్పుల బాధతో జమాల్ మృతి చెందాడని భార్య సుల్తానాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


