గోస్పాడు: నిరాధార ఆరోపణలతో వేధించి పూజారి ఆత్మహత్యకు కారణమైన నలుగురిని ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సుధాకర్ రెడ్డి తెలిపారు. వివరాలు.. జిల్లెల్ల గ్రామానికి చెందిన తెలుగు వెంకటరాముడు గ్రామంలోని గంగమ్మ ఆలయ కార్యకలాపాలను వంశపారంపర్యంగా వచ్చిన బాధ్యతల ప్రకారం నిర్వహిస్తున్నాడు. ఏడుగురు వ్యక్తులు అతనిపై ఆలయ నిధులను దుర్వినియోగం చేశాడని నిరాధార నిందలు మోపి, గ్రామంలో బహిరంగంగా పలుమార్లు అవమానించడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఈ నెల 1న సూసైడ్ నోట్ రాసి అర్ధరాత్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై మృతుడి కుమారుడు తెలుగు హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోస్పాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా విచారణ జరిపి నిందితులు గోటికె మల్లికార్జున రెడ్డి, మునగబోయిన నాగరాజు, నాగ మద్దిలేటి, అన్నలదాసు ఓబులేసు నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు తెలిపారు. మిగతా ముగ్గురు నిందితులను త్వరలో అరెస్టు చేస్తామని ఎస్ఐ చెప్పారు.


