నంద్యాల(అర్బన్): దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి పురస్కరించుకొని నంద్యాల చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ సూక్ష్మ పూల బొమ్మలతో రాజన్న చిత్రం గీసి పుష్పాంజ లి అర్పించారు. వైఎస్సార్ తనదైన శైలిలో చిరునవ్వులు చిందిస్తున్నట్లు చిత్రాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా కోటేశ్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి పేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి పథకాలతో రైతు బాంధవుడిగా పేరు పొందారన్నారు. ఆయ న మరణం కోట్లాది ప్రజలను వేదనకు గురి చేసిందన్నారు. రాజన్న నవ్వు వికసించిన పువ్వుల వలే స్వచ్ఛంగా ఉంటుందని కొనియాడారు.
పెద్దనేలటూరు వాసికి డాక్టరేట్
కర్నూలు సిటీ: గోనెగండ్ల మండలం పెద్దనేలటూరు కు చెందిన వెంకటేశ్వర్లు గౌడ్, సువర్ణమ్మ దంపతుల కుమారుడు డాక్టర్ ఈ.నిరంజన్గౌడ్కు శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. ఈ మేరకు నిరంజన్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘క్యాన్సర్తో బాధపడతున్న పిల్లల తల్లిదండ్రుల్లో సంరక్షకుల ఒత్తిడి’ అనే అంశంపై ప్రొఫెసర్ డి.సాయి సుజాత పర్యవేక్షణ,మార్గదర్శకత్వంలో పీహెచ్డీ పూర్తి చేశానని గ్రహీత వెల్లడించారు. పెద్దనేటూరులో పీహెచ్డీ సాధించిన మొదటి వ్యక్తిని కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
వైద్యులా.. భూత వైద్యులా?
ఆదోని: తనపై మహిళా డాక్టర్ క్షుద్రపూజలు చేయించిందంటూ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తీవ్ర చర్చ కు దారితీసింది. ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో సూపరింటెండెంట్గా డాక్టర్ ఆది నాగేష్, అనస్థటిస్ట్గా డాక్టర్ లక్ష్మీ మోనాలిసా పనిచేస్తున్నారు. ఆది నాగేష్ ఆదోనిలో క్లినిక్ కూడా నడుపుతున్నారు. 3 రోజుల క్రితం క్లినిక్ నుంచి ఆయనకు అర్జంటుగా రావాలని ఫోన్ వచ్చింది. ఆయన హుటాహుటిన వెళ్లి సిబ్బందిని విచారించారు.
క్లినిక్ ఎదుట నల్లటి కవర్
క్లినిక్ ప్రధాన ద్వారం ఎదుట ఒక నల్ల బ్యాగు ఉండటాన్ని ఆస్పత్రి సిబ్బంది గుర్తించారు. ఒక నర్సు భర్త ధైర్యం చేసి ఆ బ్యాగ్ను తెరిచి చూసి బిత్తరపోయారు. అందులో అనుమానాస్పద వస్తువులతో పాటు క్షుద్రపూజలు చేసిన సామగ్రి ఉంది. ఒక రాగి రేకు మీద డాక్టర్ ఆది నాగేష్ పేరు రాయబడి ఉంది.
సీసీ కెమెరా ఫుటేజీతో కలకలం
విషయం తెలుసుకున్న డాక్టర్ ఆది నాగేష్ సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. ఓ మహిళ నల్లటి కవర్ను తీసుకొచ్చి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉంచి వెళ్లినట్లు ఫుటేజీలో కనిపించింది. ఆ మహిళ తన సహద్యోగి డాక్టర్ లక్ష్మీ మోనాలిసాగా గుర్తించి బిత్తరపోయారు. ఆస్పత్రి సిబ్బంది కూడా షాక్కు గురయ్యారు.
పోలీసుస్టేషన్కు చేరిన వివాదం
తాను చేసిన తప్పును ఎంతకూ ఒప్పుకోకపోవడంతో డాక్టర్ లక్ష్మీ మోనాలిసాపై డాక్టర్ ఆది నాగేష్ ఆదోని టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది నాన్ కాగ్నిజబుల్ కేసు కావడంతో కోర్టు అనుమతితో కేసు నమోదు చేసి విచారణ చేయాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు తన ఫిర్యాదుపై కేసు నమోదు చేయాల్సిందేనని, అవసరమైతే జిల్లా ఎస్పీని కూడా కలుస్తానని డాక్టర్ ఆది నాగేష్ అంటున్నారు. మరో వైపు తాను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళనని, తాను కూడా డాక్టర్ ఆది నాగేష్పై అట్రాసిటీ కేసు పెడతానని తన సన్నిహితుల వద్ద డాక్టర్ లక్ష్మీ మోనాలిసా చెబుతున్నట్లు సమాచారం.


