కర్నూలు(సెంట్రల్): ఉద్యోగ సంఘాల నాయకులపై ప్రభుత్వం రాజకీయ ముద్ర వేసి ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని ఏపీజేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ వి.గిరికుమార్రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్లోని అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులను జేఏసీ నాయకులు కలుసుకొని మద్దతు కోరారు. ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ప్రభుత్వ తీరు పట్ల కార్యాలయాల్లోనే నిరసన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. నల్లబ్యాడ్జీలతోనే విధులకు హాజరుకావాలన్నారు. అందులో భాగంగానే కలెక్టరేట్ ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులు పెద్త ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వి.గిరికుమార్రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఏర్పాటై 27 నెలలు గడిచినా ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకపోవడంతో విధిలేని పరిస్థితుల్లోనే ఏపీజేఏసీ అమరావతి ఉద్యమానికి సిద్ధమైందన్నారు. గత ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటైన 12వ పీఆర్సీని తొలగించడం అన్యాయమని, ఉద్యోగులకు సంబంధించి ఇస్తామన్న ఐఆర్ 30 శాతం ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. పెండింగ్లో ఉన్న 5 డీఏలను కూడా వెంటనే ఇవ్వాలని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి పెండింగ్లోని రూ.40 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎం.వెంకటరాజు, నాయకులు ధనుంజయరెడ్డి, కృష్ణ పాల్గొన్నారు.
రూ.1.35 కోట్లతో షెడ్ల నిర్మాణాలు
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద రూ.1.35 కోట్లతో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో షెడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. కర్నూలు, ఆదోని మార్కెట్ యార్డుల్లో రూ.50 లక్షల ప్రకారం, ఎమ్మిగనూరు మార్కెట్లో రూ.35 లక్షలతో కవర్డ్ షెడ్లు నిర్మించనున్నట్లు మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు నారాయణమూర్తి తెలిపారు. కర్నూలు మార్కెట్కు మంజూరైన కవర్డ్ షెడ్ను ఈ నెల 5న మంత్రి టీజీ భరత్ భూమి పూజ చేయనున్నారని మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. 100‘‘60 అడుగుల విస్తీర్ణంలో షెడ్ నిర్మిస్తామన్నారు.


