కర్నూలు: కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించి నిరసనను తెలియజేశారు. సర్క్యూట్ బెంచ్ లేదా మొబైల్ బెంచ్ను ఏర్పాటు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నిరసిస్తూ న్యాయవాదులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ఈ గందరగోళాన్ని నివృత్తి చేసి ఆలస్యం చేయకుండా కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా కోర్టులను బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలులో జరిగిన నిరసన ప్రదర్శనలో రాయలసీమ అడ్వకేట్స్ జేఏసీ కన్వీనర్, సీనియర్ న్యాయవాది వై.జయరాజుతో పాటు బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రుడు, మహేశ్వర రెడ్డి తదితరులు నిరసన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ప్రభుత్వం, దాని మిత్రపక్షాలు ఇచ్చిన వాగ్ధానం నెరవేర్చాలని, లేకపోతే రాయలసీమ ప్రాంతమంతటా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీనియర్ న్యాయవాదులు శివరామయ్య, ఎల్లారెడ్డి, ఏఆర్ఎస్ రెడ్డి, సి.నాగేంద్రనాథ్తో పాటు బార్ అసోసియేషన్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


