కృష్ణగిరి: వదిలేసిన టమాట పంటను తిని 12 గొర్రెలు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని సంగాల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, గొర్రెల యజమానులు తెలిపిన వివరాల మేరకు..గ్రామానికి చెందని మూలింటి కురువ గౌరప్ప, కురువ అంజినేయులుకు చెందిన గొర్రెల మంద గురువారం గ్రామంలో ధర లేక వదిలేసిన టమాట పొలాన్ని కాపర్లు మేపారు. అవి తిన్న గొర్రెలకు శుక్రవారం ఉదయానికి పొట్ట ఊది ఊపిరి ఆడక ఇబ్బందులు పడటాన్ని గమనించి వెంటనే పశువైద్యాధికారులకు సమాచారం అందించారు. అయితే ఎండకు మగ్గిన టమాట కాయలు తినడంతో మందలోని 12 గొర్రెలు మృతి చెందాయి. మిగితా వాటికి మందులు తాపడంతో కోలుకున్నట్లు వారు తెలిపారు. దీంతో ఈ ఇద్దరు రైతులు రూ. 2 లక్షల వరకూ నష్టపోయారని, ప్రభుత్వం వీరిని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.


