కర్నూలు(అగ్రికల్చర్): వాము క్రయవిక్రయాల్లో అక్రమాలకు పాల్పడుతున్నారనే అనుమానితులపై ప్రత్యేక నిఘా ఉంచాలని కర్నూలు మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి అసిస్టెంట్ సెక్రటరీ, సూపర్వైజర్లను ఆదేశించారు. ఇందుకోసం ఆరు టీములు ఏర్పాటు చేశారు. బుధవారం ‘సాక్షి’లో వాము క్రయ విక్రయాల్లో జరిగే మోసాలపై ‘కాటా’కట శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి స్పందించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ అధికారులను, మార్కెట్ కమిటీని ఆదేశించారు. మార్కెట్లో వాము క్రయ విక్రయాల్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందో.. అలాంటి కమీషన్ ఏజెంట్ దుకాణాలకే సరుకు ఎక్కువగా వస్తుండటం గమనార్హం. ఏఏ కమీషన్ ఏజెంటుకు ఎక్కువ వాము వచ్చిందో.. వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని, తూకాలను తనిఖీ చేయాలని సూచించారు. తూకాలను రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగించరాదని, సాయంత్రం ఆరు గంటలకు పూర్తి చేయాలన్నారు. ఇదిలాఉంటే ప్రత్యేక టీమ్లు తనిఖీలు చేపట్టినప్పటికీ తూకాల్లో తేడాలను గుర్తించకపోవడం గమనార్హం.


