గరుడోత్సవాన్ని తిలకిస్తున్న భక్తజనం
ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారుజామున ఎగువ అహోబిలంలో గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ నృసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహుడు విశేష అలంకరించిన గరుడ వాహనాన్ని అధిష్టించారు. ఆస్థాన విద్వాంసుల మంగళకరమైన వాయిద్యాలు, పండితుల వేదోక్త మంత్ర పఠనములు.. భక్తుల గోవిందా నామస్మరణల నడుమ అట్టహాసంగా ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. గరుడ మహోత్సవం మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారు జామువరకు కొనసాగింది. బ్రహ్మోత్సవాలు ముగిసిన సందర్భంగా శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం చేపట్టారు.
శాస్త్రోకంగా అగ్గిసేవ
అహోబిల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన ఘట్టం చివరిరోజు నిర్వహించే అగ్గిసేవ. నెత్తిన అగ్గితో కొట్టించుకుంటే శుభం లభిస్తుందని, కర్మలు తెగిపోతాయని భక్తుల నమ్మకం. అగ్ని జ్వాలలు విరజిమ్ముతున్న కుంపటిని నెత్తిన పెట్టుకున్న వ్యక్తి మరో చేత్తో మండుతున్న కొరివితో భక్తుల నెత్తిన కొట్టినా ఎటువంటి గాయం కాదని భక్తులు చెప్పారు.


