పాగాలంకరణ ఏర్పాట్ల పరిశీలన
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 15న చేపట్టనున్న పాగాలంకరణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, ఎస్పీ సునీల్ షెరాన్ పరిశీలించారు. బుధవారం సాయంత్రం ఆలయానికి చేరుకుని పాగాలంకరణ కార్యక్రమం శాస్త్రోక్తంగా, సమయానికి నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చూశారు. సంబంధిత దేవస్థాన అధికారులను పాగాలంకరణకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ ప్రవేశ క్యూలైన్ నుంచి బయటకు వెళ్లే గేట్ వరకు భక్తుల రాకపోకల నిర్వహణ, భద్రతా చర్యలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, మార్గదర్శక బోర్డులు తదితర అంశాలపై దేవస్థాన సిబ్బందితో సమీక్షించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుని సురక్షితంగా తిరిగి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వీరి వెంట శ్రీశైల దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు, శ్రీశైలం సబ్ డీఎఫ్వో బబిత, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్ ఉన్నారు.


