కమనీయం.. రథోత్సవం
పత్తికొండ: కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహేంద్రస్వామి రథోత్సవం కనుల పండువగా సాగింది. పత్తికొండ పట్టణంలోని తేరుబజార్లో వెలసిన వీరబ్రహేంద్రస్వామి తిరునాల సందర్భంగా శనివారం నిర్వహించిన రథోత్సవానికి భక్తజనం పోటెత్తారు. తేరుబజారు నుంచి సుంకంగేట్ వరకు పురవీధులు జనసంద్రంగా మారాయి. ముందుగా వేద పండితులు వేద మంత్రాలతో రథాంగ హోమంనిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన రథంపై స్వామి వారి ఉత్సవమూర్తిని ఉంచి భక్తుల హర్షధ్వానాల మధ్య రథాన్ని ముందుకు కదలించారు. భక్తులు స్వామి వారి రథంపైకి అరటిపండ్లును విసురుతూ భక్తిని చాటుకున్నారు. స్వామికి టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. డీఎస్పీ వెంకటరామయ్య ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.


