
ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిల్లల సంరక్షణ
కర్నూలు: ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిల్లల సంరక్షణ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీల వెంకట శేషాద్రి సూచించారు. జిల్లా న్యాయ సేవా సదన్లో పిల్లల కోసం స్నేహ పూర్వక న్యాయ సేవల పథకం–2024పై బుధవారం వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలోని పిల్లల సంరక్షణ, రక్షణ బాధ్యత సంబంధిత ప్రభుత్వ శాఖలు తీసుకోవాలన్నారు. ప్రతి బిడ్డకు న్యాయం, గౌరవం దక్కేలా చూడాలన్నారు. లీగల్ సర్వీసెస్ యూనిట్ మెంబర్, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. దివ్యాంగులైన పిల్లలను గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నట్లు రిసోర్స్ పర్సన్, కర్నూలు డిజేబులిటీ డిపార్టుమెంట్ అసిస్టెంట్ డైరక్టర్ రైస్ ఫాతిమా చెప్పారు. నంద్యాల అడిసినల్ డీఎంహెచ్ఓ శారదాబాయి మాట్లాడుతూ.. అవసరమైన పిల్లలకు చికిత్సలు, ఉచితంగా మందులు అందిస్తున్నట్లు చెప్పారు. బడికి వెళ్లని పిల్లలను గుర్తించి స్కూళ్లలో చేర్పిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ విజయ తెలిపారు. సమస్యలు ఉంటే చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ 1098కి ఫోన్ చేయవచ్చన్నారు. పిల్లలకు జెడ్పీ పాఠశాలల్లో సకల వసతులతో ఉచిత విద్యను అందిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి తెలిపారు. అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సాంబశివరావు, గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోం సూపరింటెండెంట్ హుస్సేన్బాషా, కర్నూలు డైస్ సెంటర్ మేనేజర్ ఇర్ఫాన్బాషా తదితరులు పాల్గొన్నారు.