పగలు దాచేస్తారు.. రాత్రి దాటించేస్తారు! | - | Sakshi
Sakshi News home page

పగలు దాచేస్తారు.. రాత్రి దాటించేస్తారు!

Apr 20 2025 1:00 AM | Updated on Apr 20 2025 1:00 AM

పగలు

పగలు దాచేస్తారు.. రాత్రి దాటించేస్తారు!

● దర్జాగా కూటమి నేతల ఇసుక దందా ● నది పరివాహక గ్రామాల్లో ఇసుక అక్రమ డంప్‌లు ● అధికారులు తనిఖీ చేయరు.. పోలీసులు పట్టుకోరు

పడిదెంపాడు గ్రామ సమీపంలో తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతులు

కర్నూలు(రూరల్‌): ఉచిత ఇసుక పాలసీ కూటమి నేతలకు వరంగా మారింది. తుంగభద్ర నది పరివాహక గ్రామాల్లో దర్జాగా ఇసుక అక్రమ దందా కొనసాగిస్తున్నారు. పగలంతా నదిలో ఇసుక తోడేసి ఒడ్డున డంప్‌ చేస్తున్నారు. రాత్రికి రాత్రి టిప్పర్లలో ఊరి దాటించి విక్రయిస్తున్నారు. అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో ఇసుకాసురుల దందాకు అడ్డేలేదు. కర్నూలు మండల పరిధిలోని తీర ప్రాంతాలైన పడిదెంపాడు, పూడూరు, పంచలింగాల, దేవమడ, మునగాలపాడు, నిడ్జూరు, ఆర్‌. కొంతలపాడు, సుంకేసులలో ఇసుక డంపులు వెలుస్తున్నాయి. నది సమీపంలోని మామిడి తోటలు, ప్రైవేటు వెంచర్లు, కల్లం దొడ్లలో నిల్వ చేసినా అడిగేవారు లేరు. తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సిన మైనింగ్‌, రెవెన్యూ అధికారులు నది వైపు కన్నెత్తి చూడటం లేదు. డంప్‌ చేసిన ఇసుకను నదితీర గ్రామాల నుంచి కర్నూలు నగరంతోపాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఒక్కో ట్రాక్టర్‌ దూరాన్ని బట్టి రూ.4 వేల నుంచి రూ.5 వేలకు పైగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కర్నూలు మండలంలో ఎక్కడా ఇసుక రీచ్‌లు లేవు. అయినా ఇసుక మాత్రం అక్రమ రవాణా అవుతోంది. వాస్తవంగా నది తీర ప్రాంత వాసులకు నిర్మాణాలకు ఇసుక అవసరమైతే సచివాలయం నుంచి అనుమతి తీసుకుని నదిలో తవ్వుకోవచ్చు. ఇలా అనుమతితో తవ్వుకునే వారు ఎవరూ కనిపించరు. అంతా కూటమి నేతలు ఏర్పాటు చేసిన ట్రాక్టర్లు ఉంటాయి. వీరి వద్ద నుంచే ఇసుక కొనుగోలు చేసుకోవాల్సిందే. వీరిని కాదని గుప్పెడు ఇసుక కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఉచిత ఇసుక పాలసీ పేరుతో కూటమి నేతలు తుంగభద్రనదిని తోడేస్తున్నారు. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం లేకపోవడంతో తవ్వకాలు పగలు, రాత్రి తేడా లేకుండా జరుగుతున్నాయి.

దందాకు రైట్‌ రైట్‌..

కూటమి నేతల ఇసుక దందాకు పోలీసులు, అధికారులు రైట్‌ రైట్‌ అంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రహదారులపై ఇసుక ట్రాక్టర్లు వెళ్తున్నా కనీసం అనుమతి ఉందా.. లేదా? అనేది అడగడం లేదు. ముందుగానే మామూళ్లు అందుతుండటంతో అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పడిదెంపాడు, పూడూరు వైపు వచ్చే ట్రాక్టర్లు సూదిరెడ్డిపల్లె స్టేజి నుంచి ఇటు కర్నూలు, ఇటు బ్రాహ్మణకొట్కూరు వైపు దూసుకెళ్తున్నా అడిగేవారు కరువయ్యారు. అలాగే హంద్రీ నదిలో ఇసుక ట్రాక్టర్లు వెంగన్న బావి మీదుగా రయ్‌.. రయ్‌మంటున్నాయి. అయితే కొందరు పోలీసు సిబ్బంది మామూళ్లు తీసుకుని ట్రాక్టర్లను వదిలేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇసుక అక్రమ రవాణా అరికడతాం

మునగాలపాడు, పంచలింగాల, నిడ్జూరు, అర్‌.కొంతలపాడు గ్రామాల పరిధిలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. పోలీస్‌, రవాణా శాఖ అధికారుల సమన్వయంతో దాడులు చేసి కేసులను నమోదు చేస్తాం. నదుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటుతాయి. ఈ విషయంపై ఆయా గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం.

– టీవీ రమేష్‌ బాబు, కర్నూలు రూరల్‌ తహసీల్దార్‌

పగలు దాచేస్తారు.. రాత్రి దాటించేస్తారు! 1
1/3

పగలు దాచేస్తారు.. రాత్రి దాటించేస్తారు!

పగలు దాచేస్తారు.. రాత్రి దాటించేస్తారు! 2
2/3

పగలు దాచేస్తారు.. రాత్రి దాటించేస్తారు!

పగలు దాచేస్తారు.. రాత్రి దాటించేస్తారు! 3
3/3

పగలు దాచేస్తారు.. రాత్రి దాటించేస్తారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement