
ఉమ్మడి జిల్లాకు 80 డ్రోన్లు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాకు 80 డ్రోన్లు మంజూరయ్యాయి. కర్నూలు జిల్లాకు 40, నంద్యాల జిల్లాకు 40 ప్రకారం కేటాయించారు. టీడీపీ కార్యకర్తలతో ఏర్పాటైన ఎఫ్ఎంబి కిసాన్ డ్రోన్ గ్రూపులకు మంజూరు చేస్తోంది. వీటిని సరఫరా చేసేందుకు డ్రోగో, విహంగ కంపెనీలను ఎంపిక చేసింది. డ్రోగో కంపెనీ డ్రోన్ పూర్తి ధర రూ.9.80 లక్షలు, విహంగ కంపెనీ డ్రోన్ ధర రూ.9.81 లక్షలు ఉంటుంది. ఇందులో ప్రభుత్వం 80 శాతం సబ్సిడీ ఇస్తుంది. అయితే 50 శాతం మొత్తానికి బ్యాంకులు రుణాలు ఇస్తాయి. మిగిలిన 50శాతం కిసాన్ డ్రోన్ గ్రూపులు భరిస్తాయి. ఎఫ్ఎంబీ కిసాన్ డ్రోన్ గ్రూపులో 5గురు సభ్యులు ఉంటాయి. గ్రూపు సభ్యులు పైలెట్గా ఎంపిక చేసుకొన్న వారికి ప్రభుత్వం ఇప్పటికే శిక్షణ ఇచ్చింది. డ్రోన్ల సామర్థ్యం 25 లీటర్లు ఉంటుందని వ్యవసాయ అధికారులు తెలిపారు.
సీయూలో పీజీ పరీక్షలు
కర్నూలు కల్చరల్: క్లస్టర్ యూనివర్సిటీ (సీయూ) పరిధిలో పోస్ట్గ్రాడ్యుయేషన్ (పీజీ) నాల్గో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలను బుధవారం వర్సిటీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ వి. వెంకట బసరావు పరిశీలించారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. రిజిస్ట్రార్ డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ నాగరాజ్ శెట్టి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ పాలక వర్గాల ఏర్పాటుకు ప్రతిపాదనలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని ఎమ్మిగనూరు, పత్తికొండ వ్యవసాయ మార్కెట్ కమిటీలకు త్వరలో పాలక వర్గాలు ఏర్పాటు కానున్నాయి. జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారులు ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇది వరకు కూటమి ప్రభుత్వం మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పూర్తి స్థాయి పాలక వర్గాల ఏర్పాటుకు మార్కెటింగ్ శాఖ ప్రతిపాదనలు పంపింది. ఎమ్మిగనూరు మార్కెట్ కమిటీకి కురువ మల్లేష్, పత్తికొండ మార్కెట్ కమిటీకి ఎస్.నబీసాహెబ్ చైర్మన్లుగా నియమితులు కానున్నారు. వైస్ చైర్మన్, పాలక వర్గం సభ్యులతో జీవోల కోసం ప్రతిపాదనలు పంపినట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ నారాయణ మూర్తి తెలిపారు.
జల్జీవన్ పనుల పరిశీలన
మద్దికెర: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1.84 కోట్ల నిధులతో మద్దికెరలో చేపట్టిన జల్జీవన్ మిషన్ పనులను కేంద్ర బృందం సభ్యుడు మాదేశ్వరన్ బుధవారం పరిశీలించారు. ట్యాంకు త్వరలో పనులు పూర్తి చేసి నీటిని అందిస్తారని తెలిపారు. గ్రామీణ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడకుండా జల్జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తోందని తెలిపారు. ఈయన వెంట ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఎండీ ఖాన్, ఏఈ మయాంక్, ఈఓఆర్డీ మద్దిలేటిస్వామి, సచివాలయ ఏఈలు విష్ణు, చంద్రశేఖర్, బండారి ఆంజనేయులు ఉన్నారు.