పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్ నవీన్
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీకోసం)లో వచ్చిన అర్జీలపై సానుకూలంగా స్పందించి, పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీతో పాటు డీఆర్వో కె. శ్రీధర్రెడ్డి, కేఆర్ఆర్సీ ఎస్డీసీ నీలకంఠేశ్వరరెడ్డి, డీఎస్పీ ఆవుల శ్రీనివాస్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ పీజీఆర్ ఎస్లో వచ్చిన అర్జీలను అధికారులు పరిశీలించి క్షేత్రస్థాయిలో ఆ సమస్య ఏ విధంగా పరిష్కరించవచ్చో అధ్యయనం చేయాలన్నారు. అనంతరం శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారులు సమస్య పరిష్కారం కాలేదని తిరిగి మరలా పీజీ ఆర్ఎస్కు రాకుండా చూడాలన్నారు. మొత్తం 102 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు.
● హనుమాన్ జంక్షన్ నుంచి కలిదిండి వరకు నిర్మించిన గ్యాస్ పైప్లైన్ నిర్మాణం వల్ల తమ వ్యవసాయ భూమిని నష్టపోతున్నామని గుడివాడ మండలం మోటూరు గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. తొలుత నాలుగు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల లోతులో నిర్మాణం చేస్తామని చెప్పారని, ఇప్పుడు 82 అడుగులు భూమి కావాలని ప్రతిపాదనలు పెట్టారన్నారు. దీని వల్ల 50 సెంట్లు భూమి ఉన్న రైతు 40 సెంట్లు, 10 ఎకరాల భూమి ఉన్న రైతు రెండు ఎకరాల నష్టపోతున్నారని, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.


