పటమట(విజయవాడతూర్పు): విజయవాడలోని హోటళ్లలో శుభ్రతపై జరుగుతున్న తనిఖీల నేపథ్యంలో ‘సాక్షి’ శుక్రవారం ‘తనిఖీల్లో తిరకాసు’ శీర్షికన ప్రచురించిన కథనంపై నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారులకు క్షేత్రస్థాయి సిబ్బంది పంపే నివేదికల్లో డొల్లతనంపై ఈ కథనం రాగా.. శుక్రవారం జరిగిన తనిఖీల్లో అపరిశుభ్ర వాతావరణం, వసతులు సరిగా లేని హోటళ్లపై చర్యలు చేపట్టారు. ఆయా హోటళ్లకు జరిమానా విధించటంతోపాటు లోపాలను సరిచేసుకునేందుకు నిర్ణీత గడువుతో నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే తనిఖీలు జరిగిన హోటళ్లలో 50 హోటళ్లకు కూడా నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఉత్తుత్తి తనిఖీలు చేస్తున్న అధికారు తీరుపై కూడా ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
హోటళ్లకు రూ.15వేలు జరిమానా..
విజయవాడ నగరపాలక సంస్థ ప్రజారోగ్య విభాగం అధికారులు హోటళ్లపై తనిఖీలు ముమ్మరం చేశారు. 37వ డివిజన్ పరిధిలోని కెనాల్ రోడ్ ప్రాంతంలో పలు హోటళ్లను తనిఖీ చేశారు. ప్రజారోగ్యానికి విఘాతం కలిగించే విధంగా అపరిశుభ్ర పరిస్థితుల్లో హోటల్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు మూడు హోటళ్లకు ఒక్కొక్కదానికి రూ.5,000 చొప్పున జరిమానా విధించి నోటీసులు జారీ చేశారు. సర్కిల్–1 శానిటరీ సూపర్వైజర్ డి. సోమరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.


