పటమట(విజయవాడతూర్పు): పటమటలో అదుపుతప్పిన ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది. ఆదివారం అత్యంత రద్దీగా ఉండే రైతుబజారువద్ద తెలంగాణ రిజి
స్ట్రేషన్ కలిగిన టీఎస్ 07ఎఫ్కే 6469 కారు పటమట పంటకాల్వ రోడ్డు నుంచి హైస్కూల్ రోడ్డు మీదుగా బందరురోడ్డు వైపు వెళ్తోంది. ఆ సమయంలో అదుపుతప్పి వరుసగా మూడు బైక్లు, ఒక గుడ్ల వ్యాన్ను ఢీకొట్టింది. అనంతరం డివైడర్పైకి దూసుకెళ్లి అక్కడే ఆగి పోయింది. ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. బ్రేక్ వేయాల్సిన సమయంలో పొరపాటున యాక్సిలేటర్ తొక్కడంతో కారు అదుపుతప్పినట్లు స్థానికులు తెలిపారు. ఆ ప్రాంతవాసుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పటమట పోలీసులు కారు నడిపిన డ్రైవర్ గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి కేసరి విజయ్ (50)గా గుర్తించారు. బాధితులు పెదపులిపాక శ్రీనగర్కాలనీకి చెందిన మరీదు రామకృష్ణ, యనమలకుదురుకు చెందిన పంచకర్ల నాగబాబు ఫిర్యాదు మేరకు పటమట పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
దుర్గాఘాట్లో గుర్తుతెలియని మృతదేహం
వన్టౌన్(విజయవాడపశ్చిమ): దుర్గాఘాట్ వద్ద కృష్ణానదిలో మృతదేహం కొట్టుకువచ్చిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే దుర్గాఘాట్లోని నీటిలో ఒక వ్యక్తి మృతదేహాన్ని అక్కడ పని చేసే సిబ్బంది గుర్తించారు. దానిపై వన్టౌన్ పోలీసులకు సమాచారమందించారు. వారు అక్కడకు చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉంటుందని, అతని చేతిపై శ్రీరామ్ అని పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద ఎటువంటి గుర్తింపు లభించలేదు. మృతుడు నదిలో మునిగి మరణించినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీనిపై అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిపై కేసు
గన్నవరం: అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటనపై గన్నవరం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం చిన్ననందిగామకు చెందిన ఇ.కృష్ణ(25) రెండు రోజుల క్రితం దావాజీగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి వారి దగ్గర అతను డబ్బులు తీసుకుని స్వగ్రామానికి వెళ్తున్నట్లుగా చెప్పాడు. తీరా ఆ డబ్బుతో మద్యం సేవించిన కృష్ణ గ్రామ శివారులోని బూతుమిల్లిపాడు వెళ్లే రోడ్డు మలుపులో తుమ్మ చెట్టుకు ఉరేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఎస్ఐ శ్రీధర్ నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు.


