గంపలగూడెం: గంపలగూడెం మండలం తోటమూలలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నేతలు స్వాహా చేశారని వైఎస్సార్ సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాసు ఆరోపించారు. ఈ భూములను ఆదివారం స్వామిదాసు పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ దీర్ఘకాలంగా పేదలు వినియోగిస్తున్న ప్రభుత్వ భూములను జీవో నంబర్ 30 కింద రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించగా, దీన్ని అడ్డు పెట్టుకుని రెవిన్యూ అధికారులు రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్వామిదాసు పేర్కొన్నారు. ఈ విధానాన్ని తప్పుదారి పట్టించిన అధికార పార్టీ నేతలతో పాటు కలెక్టర్, తిరువూరు రెవిన్యూ డివిజనల్ అధికారి, గంపలగూడెం తహసీల్దార్లపై ప్రభుత్వం చర్య తీసుకోవాలని స్వామిదాసు డిమాండ్ చేశారు. బహిరంగ మార్కెట్లో గజం రూ.5,800 విలువైన భూమిని రూ.1600కే రిజిస్ట్రేషన్ చేయడం, అధికార పార్టీ భూదందాపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆందోళనకు సిద్ధమని స్వామిదాసు హెచ్చరించారు.
ఉన్నతాధికారులు స్పందించాలి
సెంటు భూమి విలువ రూ.50 లక్షలకు పైగా ఉన్న తోటమూలలోని 62–1, 62–3, 62–4 సర్వే నంబర్లలో 23 సెంట్లకు జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు. బూరుగు అంజలి 193.6 గజాలు, బోడపాటి బుజ్జి 242, వలపనబోయిన సీతామహాలక్ష్మి 242, బోడపాటి భద్రాచలం 242, షేక్ మస్తాన్వలి 193 గజాల చొప్పున మొత్తం సుమారు 23 సెంట్లు భూమి రిజిస్ట్రేషన్ అయిందని తెలిపారు. ఈ ఏడాది జూన్ 9న తిరువూరు సబ్రిజిస్ట్రారు కార్యాలయంలో 5 అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని, జీవో లోని క్లాజ్ 4/8లో విలువైన భూమిని క్రమబద్ధీకరించవద్దని పేర్కొన్నా అక్రమంగా జరిగిన రిజిస్ట్రేషన్లను వెంటనే రద్దు చేయాలని స్వామిదాసు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ గంపలగూడెం మండల అధ్యక్షుడు కావూరి వినయ్ కుమార్, రాష్ట్ర పార్టీ నేత మద్దిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, పెదకొమెర గ్రామ పార్టీ అధ్యక్షుడు కోట లక్ష్మీనారాయణ, జిల్లా నేతలు మందపాటి ఉమామహేశ్వరరెడ్డి, మండల వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఆలపాటి ఉమామహేశ్వరరావు, నేతలు నల్లగట్ల సుధారాణి, కొత్తగుండ్ల నరసింహారావు, అనుమోలు కృష్ణారావు, యరమల రామిరెడ్డి, వంగల వైకుంఠం, కోటదాసు, యరమల రామచంద్రారెడ్డి, అత్తునూరు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ తిరువూరు ఇన్చార్జి
నల్లగట్ల స్వామిదాసు ఆరోపణ


