సాక్షి టాస్క్ఫోర్స్: స్వాతంత్య్రం దినోత్సవం రోజున ఓ ప్రభుత్వ శాఖ కార్యాలయ ఆవరణలో కూర్చున్న వారిపై తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోయి దాడులకు తెగబడ్డారు. గంజాయి మత్తులో టీడీపీ చోటా నేత దుర్భాషలాడుతూ సాక్షాత్తు విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో నిలిపిన ద్విచక్రవాహనాన్ని తగులబెట్టాడు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం మోగులూరు గ్రామానికి చెందిన ఎన్.పూర్ణచంద్రరావు వైఎస్సార్ సీపీ కార్యకర్త. ఆయనతోపాటు మరో వ్యక్తి కలిసి ఇంటిపక్కనే ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద శనివారం కూర్చున్నారు. గ్రామంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో క్లర్క్గా పనిచేస్తున్న టీడీపీ చోటా నేత గుత్తా శరత్చంద్ర అదే సమయంలో సబ్స్టేషన్కు వెళ్లాడు. గంజాయి, మద్యం మత్తులో ఉన్న అతడు ‘నా కొ..ల్లారా.. కరెంట్ ఆఫీస్కు ఎందుకు వచ్చారురా.. నీ అ.. ఇది మా అడ్డా...’ అంటూ తిట్ల పురాణానికి తెగబడి అక్కడే ఉన్న పూర్ణచంద్రరావు ద్విచక్ర వాహనంపై పెట్రోలు పోసి తగలబెట్టాడు. ఘటనపై పూర్ణచంద్రరావు కంచికచర్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ పి.విశ్వనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


