కోనేరుసెంటర్: మంగినపూడి బీచ్లో శనివారం గల్లంతైన మత్స్యకారుడు పల్లేటి రాజు (25) మరణించాడు. అతని మృతదేహాన్ని అదే ప్రాంతానికి చెందిన మత్స్యకారులు ఆదివారం ఉదయం సముద్రంలో గుర్తించారు. శనివారం తెల్లవారుజామున చేపలవేటకు వెళ్లిన రాజు అలల ఉధృతికి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిన విషయం విదితమే. శనివారం నుంచి బందరు రూరల్, మైరెన్, కోస్టుగార్డు సిబ్బంది రాజు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆదివారం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన తోటి మత్స్యకారులు, బంధువుల బోట్లలో సముద్రంలో వెతుకుతుండగా ఐదు నాటికన్ మైళ్ల దూరంలో రాజు మృతదేహాన్ని గుర్తించారు. సముద్రంలో తేలి కనబడుతున్న రాజు మృతదేహాన్ని బోటులో ఒడ్డుకు చేర్చారు. ఘటనపై కేసు నమోదు చేసిన బందరు రూరల్ పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు.
ఇది తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పేర్ని కిట్టు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వైద్యులతో మాట్లాడి పోస్టుమార్టంకు అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన చేయించేలా చర్యలు తీసుకున్నారు. బాధిత కుటుంబాన్ని కలిసి పరామర్శించి పార్టీ అండగా ఉంటుందనిఽ ధైర్యం చెప్పారు. పోస్టుమార్టం అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు రూరల్ ఎస్సై రమేష్ తెలిపారు. ఘటనతో హెచ్ సత్తెనపాలెంలో విషాదఛాయలు అలముకున్నాయి.
బాధిత కుటుంబాన్ని
పరామర్శించిన పేర్ని కిట్టు


