
ఆర్జిత సేవలకు డిమాండ్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ అమావాస్య నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. తెల్లవారుజామున ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవార్చన, శాంతి కల్యాణం, చండీహోమాలలో ఉభయదాతలు అధిక సంఖ్యలో పాల్గొని తమ నామగోత్రాలతో పూజలు జరిపించుకున్నారు. ఇక శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని నెల రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక కుంకుమార్చనలు శనివారంతో ముగిశాయి. శనివారం కూడా పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక కుంకుమార్చనలు జరిపించుకున్నారు. సాయంత్రం పంచహారతుల సేవ, పల్లకీ సేవలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి.
నూతన అన్నదాన భవన పరిశీలన
రాజగోపురం ఎదుట నూతనంగా నిర్మిస్తున్న అన్నదాన భవనాన్ని ఈవో శీనానాయక్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. దసరా ఉత్సవాల నాటికి అన్నదాన భవనం అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. క్లోక్రూమ్, సెల్ఫోన్ కౌంటర్ను తనిఖీ చేసిన ఈవో సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. కనకదుర్గనగర్లో నిర్మిస్తున్న సమాచార కేంద్రాన్ని పరిశీలించారు. ఈవో వెంట ఈఈ రాంబాబు, ఏఈ మస్తాన్, సునీల్, ఇతర అధికారులు ఉన్నారు.