
ఆటోవాలాకు వెన్నుపోటు!
కార్మికుల ఆర్తనాదాలు పట్టని కూటమి సర్కారు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వం సీ్త్రశక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 15 నుంచే ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని అడుగులు వేస్తోంది. కూటమి ప్రభుత్వం నిర్ణయంతో ఆటో డ్రైవర్లలో ఆందో ళన మొదలైంది. సీ్త్ర శక్తి పథకం తమ భుక్తిని లాగేసుకుంటుందని భయపడుతున్నారు. అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసిన తాము.. రేపటి నుంచి ఉపాధి కోల్పోయి రోడ్డున పడడం ఖాయమని, కుటుంబాలను పోషించుకోవడం ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుంటే ప్రభుత్వం తమతో కనీసం చర్చలు జరపలేదని, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ఎన్నికల హామీలో ఈ ఉచిత బస్సు ప్రయాణం హామీ ఇచ్చిన నాటి నుంచి ఆందోళన చేస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోలేదంటూ వాపోతున్నారు.
ఇదీ జిల్లాలో పరిస్థితి..
ఎన్టీఆర్ జిల్లాలో 25వేల ఆటోలు ఉన్నాయి. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాని యువత సైతం ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థికంగా స్తోమత లేకపోయినప్పటికీ ఫైనాన్స్లో ఆటో తీసుకొని వచ్చే ఆదాయంతో అప్పులు తీరుస్తున్నారు. కూటమి ప్రభుత్వం తీసుకువస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంతో కార్మికుల నెత్తిన పిడుగుపడినట్లు అయ్యింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి వస్తే తమకు కిరాయిలు ఉండవని, ఇప్పటికే ఈ రంగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఆటో నిర్వహణ పెనుభారం కానుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఆటో కార్మికులు కన్నీరు పెట్టుకుంటున్నారు.
14 నెలలైనా అమలు కాని హామీ..
తాము అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా రూ. 15వేలు ఇస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆర్థిక సహాయంతో పాటు సంక్షేమ బోర్డు, తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని నమ్మబలికింది. అధికారం చేపట్టి 14 నెలలు గడుస్తున్నా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ అమలు కాలేదు. ఇకనైనా అమలు చేస్తామని భరోసాను కల్పించలేదు. సంక్షేమ బోర్డు ఊసేత్తడం లేదు. తక్కువ వడ్డీతో ఆటోలు రుణాలు ఇస్తామన్న హామీకి అతీగతీ లేదు. తీరా సీ్త్ర శక్తి పథకం అమలు చేయబోతుండడంతో ఆటో కార్మికులు తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు. ఉచిత బస్సు ప్రభావంతో ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేని పరిస్థితి వస్తుందని, ఫైనాన్షియర్లు ఒత్తిడి చేసే ప్రమాదం ఉందని వాపోతున్నారు. హామీలు అమలు చేయాలని పలు రూపాల్లో కార్మికులు ఆందోళన చేసిన ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదు.
రూ. 15వేల ఊసెత్తని సర్కారు ఏడాదిగా ఆందోళన చేస్తున్నా కనీసం పట్టించుకోని వైనం ఏకపక్షంగా ఉచిత బస్సు పథకం ప్రకటనతో ఆగ్రహం దిక్కుతోచని స్థితిలో 23వేల కుటుంబాలు ఫైనాన్స్ బకాయిలు చెల్లించేదెలా అంటూ ఆందోళన
గత ప్రభుత్వం ఆటో కార్మికుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. వారి సంక్షేమానికి వాహన మిత్ర పథకం ప్రవేశపెట్టింది. ఆటో ఉన్న ప్రతి కార్మికుడికి ఏటా రూ.10వేలు వాహన మిత్ర కింద ఆర్థిక సహాయం చేసింది. కరోనా లాంటి కష్టకాలంలోనూ ఆదుకుంది. వరుసగా క్రమం తప్పకుండా ఆర్థిక సహాయం అందించింది. ఆటో కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది.

ఆటోవాలాకు వెన్నుపోటు!