
ఆశావర్కర్స్ను ఉద్యోగులుగా గుర్తించండి
కృష్ణలంక(విజయవాడతూర్పు): ఆశ వర్కర్లను ఎన్హెచ్ఎం ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు చెల్లించాలని, అర్హులైన వారికి ప్రమోషన్లు కల్పించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గవర్నర్పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఎన్హెచ్ఎం ఏర్పడి 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘ఆశ వర్కర్లు సాధించిన విజయాలు–ముందున్న సవాళ్లు, ప్రజారోగ్యం–ప్రభుత్వాల బాధ్యత’ అనే అంశాలపై ఆదివారం రాష్ట్ర సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గత 20ఏళ్లుగా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారే తప్ప, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ఆశావర్కర్లకు మెటర్నిటీ లీవ్ కూడా కల్పించకుండా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయన్నారు. ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె. సాయిప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వైద్యాన్ని ప్రోత్సహించే విధానం మానుకొని, ప్రభుత్వ వైద్య రంగానికి ప్రోత్సాహం అందించాలని డిమాండ్ చేశారు.
పోరాట ఫలితమే జాబ్ చార్ట్..
ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్స్ పోరాట ఫలితంగా జాబ్ చార్ట్ సాధించుకున్నామన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆశ వర్కర్స్పై వేధింపులు కొనసాగుతున్నాయని, రాజకీయ జోక్యంతో అక్రమ తొలగింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సెమినార్లో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె. పోచమ్మ, కోశాధికారి ఏ.కమల, ఉపాధ్యక్షురాలు ధనశ్రీ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు డిమాండ్