
ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు విజయ డెయిరీ ఆర్థిక సాయం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): పహల్గాం ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు విజయ డెయిరీ తరఫున ఆర్థిక సాయం అందించనున్నామని సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రకటించారు. ఉగ్రవాదుల దాడులకు నిరసనగా కృష్ణా మిల్క్ యూనియన్ (విజయ డెయిరీ) ప్రాంగణంలో గురువారం మానవ హారం నిర్మించారు. ఫ్యాక్టరీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు. ఎంపీ కేశినేని చిన్ని, చైర్మన్ చలసాని ఆంజనేయులు, ఎండీ కొల్లి ఈశ్వరబాబు, డెయిరీ బోర్డు సభ్యులు, ఉద్యోగులు, సిబ్బంది నల్ల రిబ్బన్లు ధరించి మానవ హారంలో పాల్గోని పాకిస్తాన్ చర్యలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎంపీ, చైర్మన్ మీడియాతో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి పాకిస్తాన్ ఆధ్వర్యంలోనే జరిగిందని, దీనిని భారతీయులందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న అరాచక శక్తుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఉగ్రదాడిలో రాష్ట్రానికి చెందిన చంద్రమౌళి, మధుసూదనరావు మరణించారని, వారి కుటుంబాలకు విజయ డెయిరీ తరఫున రూ.1.50 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు.