
రెవెన్యూ సిబ్బందిపైనే అనుమానాలు
నందిగామలోని పంట పొలంలో బుసకను ట్రాక్టర్లలోకి నింపుతున్న జేసీబీ
పెడన: మండల పరిధిలో బుసకాసరులు రెచ్చిపోతున్నారు. బుసక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా లెక్కచేయడంలేదు. ఏకంగా బుసక తోడేందుకు జేసీబీలను ఏర్పాటుచేసి ట్రాక్టర్ల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ఎవరైనా అడ్డుకుంటే ఇంటి అవసరాలకు అంటూ వాదనకు దిగుతున్నారు.
నందిగామ కేంద్రంగా..
బుసక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటంలేదు. అధికారులను లెక్కచేయక యథేచ్ఛగా బుసకను తరలించి అక్రమార్కులు సొమ్ముచేసుకుంటున్నారు. పెడన మండలంలోని నందిగామ గ్రామ శివారులో జేసీబీతో పంట పొలాలను తవ్వి బుసకను ట్రాక్టర్లు ద్వారా తరలించే ప్రక్రియకు అక్రమార్కులు బుధవారం ఉదయం శ్రీకారం చుట్టారు. స్థానికులు కొందరు అధికారులకు ఈ సమాచారం అందించారు. అధికారులు స్పందించి స్థానిక సిబ్బందిని పంపించి బుసక తవ్వకాలను నిలుపుదల చేయించారు. సిబ్బంది వెళ్లగానే బుసక తవ్వకాలు మళ్లీ మొదలయ్యాయి. స్థానికంగా ఉండే రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బందికి ఈ సమాచారం తెలిసినా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుసకను ఆక్రమంగా తరలించే వారి ఒత్తిడితో మిన్నకుండి పోతున్నారా లేక మరేదేయినా కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుసక తవ్వకాలను అడ్డుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇస్తున్నా ఆ దిశగా స్థానిక సిబ్బంది ముందుకు అడుగులు వేయకపోవడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
నందిగామలో యథేచ్ఛగా బుసక అక్రమ రవాణా అధికారులు అడ్డుకున్నా లెక్కచేయని అక్రమార్కులు ఇంటి అవసరాల కోసమంటూ అధికారులపై కస్సుబుస్సు
నందిగామలో బుసకను తరలిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చింది. అక్కడి సిబ్బందిని అప్రమత్తం చేయడమే కాకుండా మండల కేంద్రం నుంచి కూడా సిబ్బందిని పంపించి బుసక తరలించకుండా చర్యలు తీసుకున్నాం. ఇంటి అవసరాల నిమిత్తం తరలించుకుంటున్నామని అంటున్నారు. ఆది వాస్తవమా కాదా అని పరిశీలించి నివేదిక ఇవ్వాలని స్థానిక రెవెన్యూ సిబ్బందిని ఆదేశించాను. బుసక తరలిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
– కె.అనిల్కుమార్, ఇన్చార్జి తహసీల్దారు, పెడన
వారం రోజులుగా పెడన మండల వ్యాప్తంగా బుసక రవాణా కట్టడికి రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. బుసకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని ఫైన్ వేస్తున్నారు. పగలు, రాత్రి విధులు నిర్వహించిన తరువాత అధికారులు విశ్రాంతి తీసుకునే సమయంలో అక్రమార్కులు గప్చిప్గా బుసకను తరలిస్తున్నారు. అధికారులు వచ్చే సమయంలో తవ్వకాలు, రవాణాను నిలిపివేస్తున్నారు. రెవెన్యూ శాఖ నుంచే అధికారులు దాడికి వస్తున్నారనే సమాచారం లీకవుతోందని, అందుకే అధికారులు రాని సమయంలో బుసక తవ్వకాలు, రవాణా జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల రెవెన్యూ సిబ్బంది వెళ్లి బుసక తరలింపు నిలుపుదల చేయాలని చెప్పడంతో సదరు బుసక తరలింపు నిర్వహకుడు వారిపై కస్సుబుస్సులాడారు. ఇంటి అవసరాల నిమిత్తం తోలుకుంటున్నామని, ఎలా అడ్డుకుంటారని ఎదురుదాడికి దిగారు. బయట ప్రాంతాలకు వెళ్తే పట్టుకోవాలంటూ ఉచిత సలహా ఇవ్వడం గమనార్హం. ఇంటి అవసరాలకు బుసకను తరలించేందుకు జేసీబీలు అవసరం ఉండదు. అక్రమ రవాణా చేసేందుకే జేసీబీలను వాడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు.

రెవెన్యూ సిబ్బందిపైనే అనుమానాలు