
చోరీసొత్తుతో పట్టుబడిన దొంగలు
గూడూరు: రెండు రోజులు క్రితం కంచాకోడూరులో చోరీకి పాల్పడిన దొంగలను, వారు దొంగిలించిన సొత్తుతో సహా బుధవారం గూడూరు పోలీసులు పట్టుకున్నారు. గ్రామానికి చెందిన మానికొండ కృష్ణారావు హైదరాబాదు వెళ్లగా ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న దొంగలు తలుపులు పగలగొట్టి ఇంట్లోని రెండు ఏసీలు, ఒక ఇన్వర్టర్, బ్యాటరీ, బీరువాలోని రెండు బంగారు ఉంగరాలు, మూడు లక్ష్మీదేవి రూపులు దొంగలించుకుపోయారు. కృష్ణారావు మేనమామ ఈమని కేశవరావు ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన గూడూరు ఎస్ఐ కె.సత్యనారాయణ అధునాతన టెక్నాలజీతో దొంగలతో పాటుగా వ్యానులో తరలిస్తున్న సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిని కంచాకోడూరుకు చెందిన మేడా సాయి గణేష్, కోళ్ల చరణ్ తేజగా గుర్తించి వారిని అరెస్టుచేసినట్లు ఎస్ఐ తెలిపారు.