
బాలుడిని కాపాడబోయి యువకుడి దుర్మరణం
గుడివాడరూరల్: విద్యుదాఘాతానికి గురైన బాలుడిని కాపాడబోయి ఓ యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. మల్లాయపాలెం పరిధిలోని టిడ్కో సముదాయంలో నివసించే బాలుడు సంతోష్ తమ ఇంటి ముందు విద్యుత్ సర్వీస్ వైరుకు సపోర్టుగా వేలాడుతున్న జియో వైరును పట్టుకుని విద్యుదాఘాతానికి గురయ్యాడు. అదే ప్రాంతానికి చెందిన దొండపాటి తేజ(27) బాలుడిని పట్టుకుని పక్కకు లాగేశాడు. అయితే ఆ వైరు తేజ వీపుభాగంలో తాకడంతో అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. రామస్వామి, మరో ఇద్దరు వారిని కాపాడే ప్రయత్నంలో స్వల్పంగా విద్యుదాఘాతానికి గురయ్యారు. సంతోష్, తేజను స్థానికులు హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన తేజ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలుడు, మరో ఇద్దరికి స్వల్పంగా గాయపడ్డారు. తేజ గతంలో నందిగామ పట్టణం రమణకాలనీలో భార్యాపిల్లలతో జీవించేవాడు. గుడివాడలో జరుగుతున్న ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు చేసేందుకు గుడివాడ వచ్చి టిడ్కో సముదాయంలో ఉంటున్నాడు. ఈ క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందడంతో అతనితో పాటు పని చేసే స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. గుడివాడ తాలూకా ఎస్ఐ ఎన్. చంటిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలుడిని కాపాడబోయి యువకుడి దుర్మరణం