
దేశంలో రాజ్యాంగానికి ముప్పు
పెనమలూరు: దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పోరంకి విజ్ఞాన భారత్ పాఠశాలలో సోమవారం అబ్దుల్ కలాం స్టడీ సర్కిల్ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వాహకుడు అమరయ్యశాస్త్రి అధ్యక్షతన భారత రాజ్యాంగం నేడు ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొలీజియం కమిటీ దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అనేక మతాలకు, జాతులకు, కులాలకు దేశ సమైక్యత విధానాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించారన్నారు. అయితే దేశంలో నేటి రాజకీయ పరిస్థితుల కారణంగా రాజ్యాంగానికి తూట్లు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ సైతం నాయకుల చేతిలో సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. అబ్దుల్ కలాం స్టడీ సర్కిల్ విజ్ఞాన వేదిక నిర్వాహకుడు అమరయ్య శాస్త్రి మాట్లాడుతూ ప్రతి నెలా ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేస్తామని, దీనికి అందరి మద్దతు కావాలని కోరారు. కార్యక్రమంలో విజ్ఞాన్ భారత్ పాఠశాల కరస్పాండెంట్ ప్రొఫెసర్ కొడాలి రామశేషాద్రిరావు, మండల సీఐటీయూ కార్యదర్శి ఉప్పాడ త్రిమూర్తి, మండల సీపీఎం కార్యదర్శి షేక్.కాశిం, నేతలు షేక్ మస్తాన్, పి.పాతాళలక్ష్మి,పి.లక్ష్మీనారాయణ, సోమశేఖర్, ప్రజా సంఘాల నేతలు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రతి కార్డుదారుడికి
ఈ–కేవైసీ తప్పనిసరి
జేసీ గీతాంజలిశర్మ
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందేందుకు రేషన్కార్డులోని ప్రతి ఒక్క సభ్యుడు ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ తెలిపారు. సోమవారం నాటికి జిల్లాలో 71,110 మంది సభ్యులు ఇంకా ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ లబ్ధిదారుల వివరాలు రేషన్ షాపు డీలరు వద్ద, పౌరసరఫరాల డెప్యూటీ తహసీల్దార్ వద్ద, పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ మొబైల్ షాపులో గ్రామ రెవెన్యూ అధికారి, డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ–పోస్ పరికరాల ద్వారా గాని ఈ–కేవైసీని పూర్తి చేసుకోవచ్చునన్నారు.
ముగ్గురు రైల్వే ఉద్యోగులకు జీఎం సేఫ్టీ అవార్డులు
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): రైళ్ల నిర్వహణలో లోపాలను గుర్తించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించిన విజయవాడ డివిజన్కు చెందిన ముగ్గురు ఉద్యోగులు ‘జీఎం మ్యాన్ ఆఫ్ ద మంత్ సేఫ్టీ అవార్డును అందుకున్నారు. సోమవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయం నుంచి విజయవాడ డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్తో పాటుగా సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్లు, నాందేడ్ డివిజన్ల డీఆర్ఎంలతో వర్చువల్ పద్ధతిలో భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్కుమార్ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం, భద్రతలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం విధుల్లో అప్రమత్తంగా వ్యవహరించిన దెందులూరు ఆపరేటింగ్ విభాగంలోని స్టేషన్ సూపరింటెండెంట్ టి.వి.ఎం.యూ మహేశ్వర్, రాజమండ్రి ఆపరేటింగ్ విభాగంలోని పాయింట్ మెన్ కె.నథానియేల్, రాజమండ్రిలోని ట్రైన్ మేనేజర్ లోకేష్కుమార్లకు జీఎం అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. విజయవాడ రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు.
‘స్వచ్ఛ చల్లపల్లి’కి చిత్తూరు జిల్లా మహిళా సర్పంచులు
చల్లపల్లి: చిత్తూరు జిల్లాకు చెందిన 25 మంది మహిళా సర్పంచులు స్వచ్ఛ సుందర చల్లపల్లి పరిసరాలను, కార్యక్రమాలను వీక్షించడానికి సోమవారం విచ్చేశారు. స్వచ్ఛ చల్లపల్లికి కృషి చేస్తున్న రథసారఽథులు డాక్టర్ డీఆర్కే ప్రసాద్, పద్మావతి, స్వచ్ఛ కార్యకర్తల కృషిని అభినందించారు. అనంతరం స్వచ్ఛ కార్యక్రమాలను డీఆర్కే ప్రసాద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో వారికి వివరించారు.

దేశంలో రాజ్యాంగానికి ముప్పు