
స్వచ్ఛ ఆంధ్ర నిర్మాణంలో భాగస్వాములు కావాలి
గన్నవరం: స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ కోరారు. మండలంలోని దావాజిగూడెంలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ–వేస్ట్పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సమూన్ మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకాధికారిని నియమించిందని తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యవంతమైన జీవనం కోసం పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు. కృష్ణా కలెక్టర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యర్థాలు విపరీతంగా పెరిగాని, వాటిని శాస్త్రియ పద్ధతిలో నిర్వీర్యం చేయకపోతే పర్యావరణానికి, మానవాళికి హాని జరుగుతుందని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ కోసం ప్రతి పంచాయతీలో కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇళ్లలోని ఈ– వ్యర్థాలను ప్రజలు ఈ సెంటర్లలో అప్పగించాలని సూచించారు. బుద్దవరం పంచాయతీ శాశ్వత భవన నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. హనుమాన్జంక్షన్ నుంచి రామవరప్పాడు వరకు జాతీయ రహదారి సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సర్పంచి బడుగు బాలమ్మ, డీపీఓ జె.అరుణ, వైస్ ఎంపీపీ కొమ్మరాజు సుధీర్ తదితరులు పాల్గొన్నారు.