ఆసిఫాబాద్అర్బన్: కాళోజీ నారాయణరావు కేవలం కవి మాత్రమే కాదని, సామాన్యుల సమస్యలను రచనలతో బలంగా వినిపించిన ప్రజాగొంతుక అని పోలీసు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్ఐ అడ్మిన్ వామనమూర్తి అన్నారు. తెలంగాణ ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారాయణరావు 112వ జయంతిని బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసు అధికారులు మాట్లాడుతూ తెలంగాణ యాస, భాషలో సామాజిక అంశాలను రచనలతో ప్రజలకు చేరువ చేసి చైతన్యం కల్పించిన గొప్ప ప్రజాకవి కాళోజీ అని కొనియాడారు. కాళోజీ సాహిత్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాసేవలో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
నివాళులర్పిస్తున్న పోలీసు అధికారులు


