పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న శిబిరం 90 రోజుల పాటు 160 మందికి ఉచిత వసతి, కోచింగ్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎస్పీ
కలల
కొలువుకు
ఆసిఫాబాద్అర్బన్: ఆర్థిక ఇబ్బందులు, ప్రైవేటు కోచింగ్ సెంటర్ల భారీ ఫీజులు భరించలేక ఉద్యోగ కలలకు దూరమవుతున్న పేద నిరుద్యోగులకు జిల్లా పోలీసు శాఖ అండగా నిలిచింది. ఇటీవల కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా, ఎస్పీ నితిక పంత్ ప్రత్యేక చొరవతో ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 160 మంది అభ్యర్థులను ఎంపిక చేసి 90 రోజుల పాటు ఉచిత భోజనం, వసతితో కూడిన నాణ్యమైన శిక్షణ అందిస్తూ వారి కలల కొలువుకు ఊపిరి పోస్తున్నారు. నిష్ణాతులైన అధ్యాపకులతో ప్రిలిమ్స్, మెయిన్స్తో పాటు ఉదయం పూట ఫిజికల్ ఈవెంట్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
జిల్లాలో 139 పోస్టులు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పోలీసు నియామక నోటిఫికేషన్లో వివిధ విభాగాల్లో జిల్లాలో 139 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం సాధించి సమాజంలో ఉన్నత స్థానంలో నిలవాలన్నది చాలామంది ఆకాంక్ష. ముఖ్యంగా యువత ఖాకీ కొలువుపై ఆశలు పెంచుకుంటారు. కానీ ఆ కలను నిజం చేసుకునే క్రమంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఒడిదొడుకులు వారిని వెనక్కి నెడుతుంటాయి. ముఖ్యంగా అన్నిరంగాల్లో వెనుకబడిన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్థిక స్థోమత లేక ప్రైవేటు కోచింగ్కు నిరుద్యోగులు దూరమవుతున్నారు. అలాంటి పేద నిరుద్యోగుల కలలకు ఊపిరి పోస్తూ జిల్లా పోలీసు శాఖ వారికి అండగా నిలుస్తోంది. 15 మండలాల పరిధిలో నిరుద్యోగులకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి 160 మందిని ఎంపిక చేశారు. వీరికి 90 రోజుల పాటు భోజనం, వసతి కల్పిస్తూ ఉచిత శిక్షణ అందిస్తున్నారు.
తెలుగు, ఇంగ్లిష్లో తరగతులు
ఉచిత శిక్షణ కేంద్రాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలోనే ఏర్పాటు చేయడంతో పాటు ఎస్పీ నితిక పంత్ ప్రత్యేక పర్యవేక్షణ చేస్తున్నారు. అభ్యర్థులకు అందుతున్న వసతులతో పాటు శిక్షణను గమనిస్తూ పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. శిక్షణలో పాల్గొన్న వారిలో అత్యధిక మంది ఉద్యోగాలు సాధించేలా కృషి చేస్తున్నారు. పోలీసు ఉద్యోగం సాధించాలంటే విషయ పరిజ్ఞానంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఎంతో ముఖ్యం. ఉచిత శిక్షణకు ఎంపికై న నిరుద్యోగులకు ఉదయం 6 గంటల నుంచి 7.30 గంటల వరకు ఫిజికల్ శిక్షణ ఇస్తున్నారు. దాంతో పాటు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో విజయం సాధించేందుకు తెలుగు, ఇంగ్లీష్ మా ధ్యమాల్లో శిక్షణను అందిస్తున్నారు. ఇందుకోసం నిష్ణాతులైన అధ్యాపకులను నియమించారు.


