పత్తా లేని నూతన వేతన ఒప్పందం
అస్త్రంగా మలుచుకుంటున్న పార్టీలు
‘గుర్తింపు’ ఎన్నికల్లో లబ్ధికి ఎత్తులు
కార్మికుల మద్దతు కోసం డ్రామాలు!
గందరగోళంలో మిల్లు కార్మికులు
ఓటు బ్యాంక్ రాజకీయాలు!
2022లో గుర్తింపు సంఘం లేకపోవడంతో అప్పటి ఒప్పందం వర్క్స్ కమిటీతో కుదిరింది. ఇప్పుడు కూడా గుర్తింపు సంఘం లేకపోవడంతో ఎవరితో మాట్లాడాలో మేనేజ్మెంట్కు అర్థం కావడంలేదు. ఈ అయోమయాన్ని రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కార్మికులు వాపోతున్నారు. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చుట్టూ తిరుగుతూ రాష్ట్ర కార్మికశాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రులను కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. ఒక వర్గం నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మద్దతు కోరుతుండగా, మరో వర్గం వారు ప్రతిపక్ష నాయకులైన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో కార్మికుల సమస్య పరిష్కారం కాదని ఓటు బ్యాంక్ రాజకీయమే ముఖ్యమనే అనుమానం కార్మికుల్లో బలంగా వినిపిస్తోంది. తమను రెండువర్గాలుగా చీల్చి ఓట్లు లెక్కిస్తున్నారే గాని తమ వేతనాల గురించి ఎవరూ మాట్లాడటం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అధికార, ప్రతిపక్ష నాయకులు దీన్ని రాజకీయ అ స్త్రంగా వాడుకుంటున్నారని కొందరు కార్మికులు బ హిరంగంగానే ఆరోపిస్తున్నారు. కొన్ని సంఘాలు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేసి ముందుగా వేతన ఒప్పందం చేస్తేనే మద్దతంటూ డిమాండ్ చేస్తున్నాయి.
కాగజ్నగర్టౌన్: సిర్పూర్ పేపర్మిల్లు కార్మికుల సంకట పరిస్థితి ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. 2022లో కుదిరిన వేతన ఒప్పంద సవరణ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. కార్మికులు నూతన ఒప్పందం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, మేనేజ్మెంట్, యూనియన్లు రాజకీ య నాయకులంతా అగ్రిమెంట్ పేరుతో ఎన్నికల లెక్కలు వేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. మిల్లులో 373 మంది పర్మనెంట్ కార్మికులు, 800 మంది జాబ్ కాంట్రాక్ట్, 800మంది ట్రైనీ ఆఫీస్ కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తుండగా 1,600 మంది కార్మిక కుటుంబాలు జీవిస్తున్నాయి. 2022లో నాలుగేళ్లకు కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రతీ రెండేళ్లకు రూ.2,500 చొప్పున వేతనం పెంచాల్సి ఉంది. ఆ ఒప్పందం గడువు ముగిసి ఐదు నెలలైనా నూతన ఒప్పందం పత్తా లేకుండాపోయింది.
ఇదీ.. ఎస్పీఎం చరిత్ర
1938లో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్తో మొదలైన ఎస్పీఎం 1943లో బిర్లా యాజమాన్యంలో స్థాపించబడి 1943లో ఉత్పత్తిని ప్రారంభించింది. 1950లో ఎస్పీఎం బిర్లా గ్రూప్ అధీనంలోకి వెళ్లింది. అప్పటినుంచి పేపర్ మిల్లులో ఉత్పత్తి నిరాటంకంగా కొనసాగింది. మిల్లులో ఆరు మిషన్లతో రోజుకు 300 టన్నుల ఆరు రకాల పేపర్ ఉత్పత్తి అయ్యేది. 2007–08లో రెండు కొత్త యంత్రాలను ఏర్పాటు చేసి ఉత్పత్తి పెంచాలనే లక్ష్యంతో ఐడీబీఐ (ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో మిల్లును తాకట్టు పెట్టి రూ.350కోట్ల రుణం తీసుకువచ్చింది. బిర్లా గ్రూప్ చేతుల్లో ఆసియాలోనే అత్యంత నాణ్యమైన కాగితాన్ని తయారు చేసిన ఘనచరిత్ర ఎస్పీఎం సంపాదించింది. ఒకప్పుడు వేల మంది కార్మికులకు ఉపాధి కల్పించి లాభాలు కురిపించిన సంస్థ యాజమాన్యాల వైఫల్యం, పాలకుల నిర్లక్ష్యంతో నష్టాల బాట పట్టింది. కానీ, 2014లో ముడిసరుకు కొరత, విద్యుత్ బకాయిలు, పాత యంత్రాల కారణంగా కాగజ్నగర్ ఒక నిశబ్ద నగరంగా మారిపోయింది. నాలుగేళ్ల నిరీక్షణ అనంతరం జేకే యాజమాన్యం ప్రభుత్వ చొరవతో 2019లో మళ్లీ పునఃప్రారంభమైంది. మిల్లును టేకోవర్ చేసేందుకు ముందుకువచ్చిన జేకే కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 10ఏళ్లపాటు పలు రకాల రాయితీలు కల్పిస్తూ జీవో 18ని జారీ చేసింది. రాష్ట్ర జీఎస్టీలో వందశాతం రీయింబర్స్మెంట్, స్టాంప్ డ్యూటీపై వందశాతం రాయితీ, రూ.50కోట్ల లోపు క్యాపిటల్ పెట్టుబడుల్లో 20శాతం సబ్సిడీ కల్పించింది. పేపర్ తయారీకి అడవులు, మార్కెట్ నుంచి సరఫరా చేసే సుబాబుల్, ఇతర ముడిసరుకును పదేళ్లపాటు 1.5 లక్షల ఏడీఎం వరకు రాయితీ ఇచ్చింది. అవసరమైన బొగ్గును కోల్మైన్స్ నుంచి సరఫరా చేసేలా చర్యలు తీసుకుంది. కంపెనీ ప్రారంభించేందుకు అన్ని రకాల అనుమతులను ప్రభుత్వం ఇచ్చింది. ‘డీ’ గ్రేడ్ భూముల్లో మొక్కలు నాటేందుకు, పదేళ్లపాటు విద్యుత్ సరఫరా కోసం రాయితీలు కల్పించింది.


