ఆసిఫాబాద్అర్బన్: పంచాయతీ కార్మికులకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం రూ.26వేలు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో శ్రీనివాస్కు వినతిపత్రం అందించారు. పంచాయతీ కార్మికుల యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక స్టేటస్ కల్పించాలని, ప్రతినెలా 1న ప్రభుత్వం నుంచి నేరుగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాజకీయ కారణాలతో కార్మికులను తొలగిస్తున్న సర్పంచులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సిబ్బంది సంజయ్, విజయ్, వెంకటేశ్, సంతోష్, మార్లు తదితరులు పాల్గొన్నారు.


