ఆసిఫాబాద్అర్బన్: మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన ప్రొ.జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లి జయశంకర్ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, డేవిడ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్, మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, ఏఎంసీ చైర్పర్సన్ మంగతో కలిసి నివాళులర్పించారు. మహనీయులు చూపిన దారిలో నడవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో దాసరి వేణు, బీసీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్, డీపీవో భిక్షపతిగౌడ్, డీఆర్డీవో దత్తారావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు
కాగజ్నగర్రూరల్: ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. కోసిని శివారులోని 79, 80 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమిని గురువారం ఆర్డీవో కృష్ణయ్య, తహసీల్దార్ మధుకర్తో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో వార్డు నం.15వ వార్డు, కాపువాడలో ఓ వ్యక్తి రహదారిని ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నాడని, ఓ వెంచర్లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ప్లాట్లు చేశారని ఆరోపణల వచ్చిన నేపథ్యంలో అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ ఆస్తులకు హద్దులు నిర్ధారించి స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి, అధికారులు పాల్గొన్నారు.


