ఆసిఫాబాద్అర్బన్: మహిళల ఆర్థిక స్వావలంబనకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, సెర్ప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని బుధవారం అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్ కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ ఇరుకుల మంగతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు కుట్టు మిషన్లు, ఎంబ్రాయిడరీ మిషన్ల ద్వారా నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. జిల్లాలోని సుమారు 80వేల మంది విద్యార్థుల రెండు జతల ఏకరూప దుస్తులు కుట్టే పనులను మహిళా సంఘాలకు అప్పగించినట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా క్యాంటీన్ నిర్వహణ, రెబ్బెన మండలం నంబాల గ్రామంలో సోలార్ పవర్ ప్లాంట్, ప్రతినెలా ఒక్కో ఆర్టీసీ బస్సు ద్వారా రూ.70వేల ఆదాయం సమకూరుతుందని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి సంఘాలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు ఆదాయాన్ని పొందేలా వ్యాపార రంగాల్లో రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో దత్తారావు, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీలు
సహకరించాలి
ఆసిఫాబాద్అర్బన్: ఎస్ఐఆర్ ప్రక్రియలో అనమలిస్ జాబితాలోని వివరాలను సరిచేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం డీఆర్వో దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ అనమలిస్ జాబితాలోని సంఖ్యను తగ్గించేందుకు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ నెల 10లోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


