కెరమెరి: ముద్ద అన్నం, నీళ్ల పప్పు పెడుతున్నారని మండలంలోని హట్టి ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం రాత్రి 9.30 గంటల వరకు భోజనం చేయకుండా చెత్త కుండీల్లో పడేసి నిరసన తెలిపారు. పాఠశాలకు వచ్చిన ఆదివాసీ నాయకుల ఎదుటే హెచ్ఎం పంచపులతో వాగ్వాదానికి దిగారు. ‘రాత్రి వండిన అన్నం ముద్దయ్యింది. పప్పు, ఆలు కర్రీలో మొత్తం నీళ్లే.. ఉప్పు, కారం లేదు..’ ఎలా తినమంటారంటూ ప్రశ్నించారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్, నాయకులు సెడ్మకి తుకారాం, కోవ ఇందిర విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నెల రోజులుగా మెనూ పాటించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. వారం క్రితం ఇడ్లీలు తిని 27 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. ఇటీవల పాఠశాలను ఐటీడీఏ పీవో మంద మకరందు సందర్శించిన సమయంలో హెచ్ఎంకు మెమో సైతం జారీ చేశారని తెలిపారు. హెచ్ఎం స్పందిస్తూ విద్యార్థులు అకారణంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని, మెనూ పాటిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ విషయమై ఏటీడీఏ శ్రీనివాస్ను వివరణ కోరగా.. ఇదివరకే హెచ్ఎంకు పీవో మెమో ఇచ్చారని, బుధవారం ఉదయం పాఠశాలను తనిఖీ చేసి, వార్డెన్ బాధ్యతలు ఇతరులకు ఇస్తామని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో హెచ్ఎంను కూడా మారుస్తామని ఆయన పేర్కొన్నారు.


