రెబ్బెన: చేతిపంపుల నీటి కంటే తాగేందుకు మిషన్ భగీరథ పథకం ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లు ఎంతో మేలని మిషన్ భగీరథ ఎస్ఈ రవీందర్ అన్నా రు. మండలంలోని రాంపూర్ పంచాయతీని శుక్రవారం సందర్శించారు. మిషన్ భగీరథ నీటితో పాటు బోర్వెల్స్ ద్వారా వచ్చే నీటిని పరీక్షించారు. స్థానికులు సరఫరా చేస్తున్న నీటిని వినియోగిస్తున్నారా.. సాధారణ చేతిపంపుల నీటిని వినియోగిస్తున్నారా అని ఆరా తీశారు. భగరీథ నీటిని ఇంటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నామని చెప్పగా.. చేతిపంపుల నీటితో పోల్చితే భగరథ నీటిలో టీడీఎస్ తక్కువగా ఉందని తెలిపారు. టీడీఎస్ ఎక్కువ ఉన్న నీటిని తాగితే మూత్రపిండాల్లో రాళ్లు వంటి సమస్యలు తలెత్తుతాయన్నారు. మినరల్ వాటర్ ఎప్పటి పరిస్థితుల్లో వినియోగించవద్దని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీలో రికార్డులు, వాటర్ ట్యాంక్ను పరిశీలించారు. కార్యక్రమంలో డీఈఈ శైలేందర్, ఏఈఈ వికాస్, గ్రిడ్ ఏఈఈ రాజేశ్, పంచాయతీ కార్యదర్శి ధనలక్ష్మి, ఉప సర్పంచ్ పురుషోత్తం పాల్గొన్నారు.


