మూగబోయిన మైక్లు
జిల్లాలో ముగిసిన మున్సిపల్ ప్రచార పర్వం చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ఇక మద్యం, నగదుతో ప్రలోభాలు
ఆసిఫాబాద్: కాలనీల్లో వారం రోజులుగా మోత మోగిస్తున్న మైకులు మూగబోయాయి. సోమవారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్రులు పోటాపోటీగా ప్రచారం చేశారు. ముఖ్య నాయకులతో కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేయడంతోపాటు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఎన్నికలకు మరికొన్ని గంటల గడువు మాత్రమే ఉండటంతో ప్రలోభాలతో మభ్యపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 27న మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాగా ఈ నెల 3న నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఆసిఫాబాద్, కాగజ్నగర్ బల్దియాల్లో 224 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ పీఠం బీసీ జనరల్, కాగజ్నగర్ బీసీ మహిళకు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే..
హోరెత్తించిన ముఖ్య నేతలు
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపును అన్ని పార్టీలు ప్రతి ష్టాత్మకంగా తీసుకోవడంతో ముఖ్య నేతలంతా ప్ర చారంతో హోరెత్తించారు. ఆయా పార్టీలకు చెందిన జిల్లా ఇన్చార్జీలు పట్టణాల్లో మకాం వేశారు. నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తూ ప్రచారం సాగించారు. అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎ మ్మెల్సీ దండె విఠల్, డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, డీసీసీ మాజీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్ ప్రభుత్వం చే పడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. ప్రతిపక్షాల వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు విశ్రాంతి లేకుండా కాలనీల్లో తమ పార్టీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేశారు. ఆసిఫాబాద్లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. సర్వేల ద్వారా టికెట్లు కేటాయించారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తు లేకుండానే అధిక స్థానాలు కై వసం చేసుకున్నామని, ఈ సారి కారు గుర్తు దూసుకెళ్తుందని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. కాగజ్నగర్లో కుడిఎడమగా ఉన్న అదే పార్టీకి చెందిన నేతలు మాజీ ఎమ్మెల్యే కోనప్ప, ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సైతం ఒకటిగా ప్రచారం చేశారు. భారతీయ జనతా పార్టీ ఏకంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్తో ప్రచార సభ నిర్వహించింది. ఎంపీ గోడం నగేశ్, జిల్లా అధ్యక్షుడు దోని శ్రీశైలం, అరిగెల నాగేశ్వర్రావులు సైతం ప్రచారంతో హోరెత్తించారు.
మద్యం, నగదు పంపిణీపై ఫోకస్
ప్రచార గడువు ముగియడంతో ప్రలోభాల ప ర్వం మొదలైంది. చివరి అస్త్రంగా అభ్యర్థులు మద్యం, నగదు పంపిణీపై ఫోకస్ పెట్టారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నాలుగు రోజులుగా ఆ యా పార్టీల అభ్యర్థులు ఓటర్లకు ఉదయం అ ల్పాహారం, మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడంతోపాటు కొంత నగదు ఇస్తూ మ చ్చిక చేసుకునే యత్నం చేశారు. విద్య, ఉద్యోగాలు, ఇతర కారణాలతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను స్వస్థలాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసిఫాబాద్, కా గజ్నగర్ పట్టణాలకు చెందినవారు ఎక్కువగా హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వారి రైలు, బస్సు చార్జీలు భరించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో ఓటుకు రూ.5 వేలు ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది. సోమవారం సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసి ఉంచనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున మద్యాన్ని రహస్య ప్రాంతాలకు డంప్ చేసినట్లు సమాచారం. పోలీసులు జిల్లా కేంద్రంలో తనిఖీలు చేపట్టగా ఓ హోటల్లో రూ.87 వేల విలువైన మద్యం లభించింది.


