
వరద నష్టాల నివారణకు చర్యలు
వ్యవసాయశాఖ అధికారులు వెంటనే నివేదికలు రూపొందించాలి దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టరేట్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష
ఆసిఫాబాద్అర్బన్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో జరిగిన వరద నష్టాల నివారణకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లాతో కలిసి వరదలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లాలో తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయని తెలి పారు. రహదారులు, కల్వర్టులు, వంతెనలు, లోలెవల్ వంతెనలు కొట్టుకుపోయాయన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం 4,503 ఎకరాల పత్తి, వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లిందని, సుమారు 3,100 మంది రైతులు పంటలను నష్టపోయారని వెల్లడించారు. వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, రైతుల వివరాలు నమోదు చేసి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. పశు సంపద నష్టం వివరాలతో నివేదికలు రూపొందిస్తే పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్, రోడ్డు భవనాలు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ పరిధిలో రహదారులు కొంతమేర ధ్వంసమయ్యాయని, తెగిన అప్రోచ్ రోడ్లకు మరమ్మతులు చేపట్టాలన్నారు. అంతకు ముందు ఎమ్మెల్సీ విఠల్ మాట్లాడుతూ సిర్పూర్(టి)లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో అక్కడి విద్యార్థుల ను ఇతర గురుకులాలకు తరలించారని తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అటవీశాఖ అడ్డుపడుతుందని ఆరోపించా రు. అంతకు ముందు మంత్రి జిల్లా కేంద్రంలోని కుమురం భీం విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి పూలమాలలు వేశారు. ఆసిఫాబాద్ మండలం మాలన్గొందికి చెందిన సిడాం గంగుకు చెందిన మేకలు వ ర్షాలతో మృత్యువాత పడగా, బాధితుడికి రూ.1.50 లక్షల పరిహారం ప్రొసీడింగ్ అందించారు. సమావేశంలో కాగజ్నగర్ అటవీ డివిజన్ అధికారి సుశాంత్, జీసీవో తిరుపతి, ఆర్డీవో లోకేశ్వర్రావు, పంచాయతీరాజ్ ఈఈ కృష్ణ, రోడ్డు భవనాల శాఖ ఈఈ సురేశ్, డీఏవో శ్రీనివాస్, పశుసంవర్ధక శాఖ అధికారి సురేశ్ పాల్గొన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ భారీ వర్షాలకు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పంట నష్టం, రహదారులు, వంతెనలు, కల్వర్టుల మరమ్మతుల కోసం అంచనాలు రూపొందించి మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు. తక్షణ సాయం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూపం ఏర్పాటు చేశామన్నారు.
రైతులను ఆదుకోవాలి
వట్టివాగు ప్రాజెక్టు కాలువకు గండి పడటంతో రైతులు పత్తి పంట నష్టపోయారని బాధితులను ఆదుకో వాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి కోరారు. జిల్లాలో కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు రై తులకు పూర్తిస్థాయిలో సాగు నీరందించాలన్నారు.
ఎన్టీఆర్ కాలనీవాసులకు శాశ్వత పరిష్కారం చూపుతాం
రెబ్బెన: ఎన్టీఆర్ కాలనీ వాసుల వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండల కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతమైన ఎన్టీఆర్ కాలనీని పరిశీలించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మంత్రికి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ విఠల్, నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, పార్టీ మండల అధ్యక్షుడు రమేశ్, మాజీ జెడ్పీటీసీ సోమయ్య, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు సుదర్శన్గౌడ్ పాల్గొన్నారు.
కుమురంభీం విగ్రహానికి నివాళి
కెరమెరి: మండల కేంద్రంలోని సాకడ చౌరస్తా వద్ద ఉన్న కుమురంభీం విగ్రహానికి మంత్రి కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ, పూలే విగ్రహాలకు నివాళులర్పించారు.
కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలి
ఆసిఫాబాద్రూరల్: వరదలతో దెబ్బతిన్న కల్వర్టులకు మరమ్మతులు చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. ఆసిఫా బాద్ మండలం రాజురకు వెళ్లే రహదారిపై కొట్టుకుపోయిన కల్వర్టును పరిశీలించారు. రాజుర గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేయాలని, బూర్గుడ నుంచి రాజుర వరకు రోడ్డు వేయాలని, పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు వినతిపత్రం అందించారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ సతీశ్ తదితరులు పాల్గొన్నారు.