
కల్లాల్లోనే ధాన్యం
దహెగాం: మండల కేంద్రంలో ధాన్యం కుప్పలు
ఈ ఫొటోలోని రైతు పేరు డోకే మధుకర్. పెంచికల్పేట్ మండల కేంద్రానికి చెందిన ఈయన రెండెకరాల్లో వరి సాగు చేశాడు. కోతలు పూర్తికాగా, ధాన్యం పొలం వద్ద కల్లంలోనే ఆరబెడుతున్నాడు. అకాల వర్షం ముప్పు పొంచి ఉండటంతో ధాన్యం కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నాడు. ఇలా.. జిల్లాలో చాలా మంది రైతులు వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
పెంచికల్పేట్(సిర్పూర్): జిల్లాలో వరికోతలు జో రందుకున్నాయి. రైతులు ధాన్యాన్ని కల్లాల్లో కుప్పలు పోశారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. మరోవైపు శనివారం జిల్లావ్యాప్తంగా గాలిదుమారం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో కల్లాల్లోని ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు.
34 కొనుగోలు కేంద్రాలు..
జిల్లా వ్యాప్తంగా వరి సాగు ఉన్న మండలాల్లో 34 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 19, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 15 కేంద్రాలు ప్రారంభించనున్నారు. ప్రభుత్వం వరి ఏ గ్రేడు రకానికి రూ.2320, సాధారణ రకానికి రూ.2300 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో కొందరు రైతులు ప్రైవేటు వ్యక్తులకు రూ.1800 నుంచి రూ.2వేలకు అమ్ముకుంటున్నారు. కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తున్న రైతులు ఆకాశం మేఘావృతమై ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. చేతికందిన పంటను కాపాడుకునేందుకు తిప్పలు పడుతున్నారు. వర్షం పడే అవకాశం ఉండటంతో కుప్పలపై టార్పాలిన్లు కప్పుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కోరుతున్నారు.
జిల్లాలో జోరుగా వరి కోతలు
ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు
కమ్ముకుంటున్న మబ్బులతో ఆందోళనలో అన్నదాతలు
మూడెకరాల్లో సాగు చేశా
మూడెకరాల్లో వరి పంట సాగు చేశాను. పది రోజుల క్రితం కోతలు పూర్తయ్యాయి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. పొలం సమీపంలోనే ధాన్యం ఆరబెట్టి కాపలా ఉంటున్నాను. ప్రతిరోజూ ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. ధాన్యాన్ని కాపాడుకోవడానికి అవస్థలు పడుతున్నాం.
– ఇర్షాద్, రైతు, ఎల్లూర్
త్వరగా ప్రారంభించాలి
పది రోజుల క్రితం కోతలు పూర్తిచేశాం. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం వి క్రయించడానికి వేచి చూస్తున్నాం. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. పంటను రక్షించుకో వడానికి ఇబ్బంది పడుతున్నాం. అధికారులు, ప్ర భుత్వం స్పందించి వరి ధాన్యం కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలి. – చప్పిడే సంజీవ్, కొత్తగూడ
19 వేల ఎకరాల్లో సాగు
ప్రస్తుతం యాసంగి సీజన్లో ఆసిఫాబాద్, రెబ్బెన, పెంచికల్పేట్, కాగజ్నగర్, బెజ్జూర్ తదితర మండలాల్లో 19వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. వట్టివాగు, ఎల్లూర్ బొక్కివాగు, బోరుబావుల కింద సాగు ఎక్కువగా ఉంది. సీడ్ వరి(ఆడ, మగ) కోతలతోపాటు సాధారణ వరి కోతలు 15 రోజులుగా జోరుగా సాగుతున్నాయి. సీడ్ వరి ధాన్యం(ఆడ) ఆయా కంపెనీలే కొంటున్నాయి. సాధారణ రకం, సీడ్ మగ ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ఎక్కువగా విక్రయిస్తారు. ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ధాన్యాన్ని కల్లాల్లోనే ఆరబెడుతున్నారు.

కల్లాల్లోనే ధాన్యం

కల్లాల్లోనే ధాన్యం

కల్లాల్లోనే ధాన్యం

కల్లాల్లోనే ధాన్యం