
ప్రజలతో మమేకం.. సేవలకు ప్రాధాన్యం
● జిల్లాలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు ● మత్తు పదార్థాల వినియోగం అరికట్టడమే లక్ష్యం ● గ్రామీణ ప్రాంతాల్లో ఆటల పోటీలు నిర్వహణ, కిట్లు అందజేత
బెట్టింగ్కు దూరంగా..
ఇటీవల పోలీస్శాఖ ఆధ్వర్యంలో కౌటాలలో జిల్లాస్థాయి వాలీ బాల్ పోటీలు నిర్వహించారు. యువత పోటీల్లో పాల్గొనడంతో బెట్టింగ్కు దూరంగా ఉన్నారు. బెట్టింగ్, చెడువ్యసనాల బారిన పడితే కలిగే నష్టాల ను వివరించారు. ప్రతీసారి సెలవుల్లో పోటీలు నిర్వహించి యువతను ప్రోత్సహించాలి.
– రవి, మురళీగూడ, మం.పెంచికల్పేట్
సేవా కార్యక్రమాలు
చేపడుతున్నాం
నేను విధుల్లో చేరిన మొదట్లో కాగజ్నగర్లో భర్త తాగుడుకు బానిస కావడంతో ముగ్గురు కుమార్తెలతో కలిసి తల్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ప్రజలు మద్యానికి బానిసై క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు. యువత గంజాయి, గుట్కాలను వినియోగించి అనారోగ్యం బారిన పడుతున్నారు. భద్రత కల్పించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో పోటీలు నిర్వహిస్తున్నాం. – డీవీ శ్రీనివాసరావు, ఎస్పీ
కౌటాల(సిర్పూర్): శాంతి భద్రతలు పరిరక్షించడంలో పోలీసుల పాత్ర కీలకం.. వారికి బాధ్యతలు, ఒత్తిళ్లు ఎక్కువే.. అడవుల జిల్లాగా పేరుగాంచిన ఈ ప్రాంతాన్ని గంజాయి, గుట్కా, గుడుంబా ఇతర వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువత, ప్రజలు బానిసలుగా మారుతున్నారు. ఈ క్రమంలో పోలీసుశాఖ ‘పోలీసులు మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలతో మమేకమవుతూనే.. అక్ర మాలు, మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ప్రత్యేక చొరవ..
జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి, గుండుబా, గుట్కా, మట్కా, బెట్టింగ్ కట్టడికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. వాటి వినియోగంతో కలిగే అనర్థాలను తెలియజేసేందుకు నేరుగా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. మారుమూల గ్రామాల్లో పర్యటించి ప్రజల అవసరాలు, వారి జీవన విధానం తెలుసుకుంటున్నారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని, ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కార మార్గం కాదంటూ.. ప్రజలను చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఏ సమస్య వచ్చినా.. వాటి పరిష్కారంలో యువత కీలక భూమిక పోషిస్తుంది. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా చదువుపై దృష్టి సారించడంతోపాటు యువత చెడుమార్గంలో వెళ్తే జరిగే అనర్థాలను వివరిస్తున్నారు. గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు యువత భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నారు.
మత్తు వదిలేలా..
ప్రజలతో ఎస్పీ శ్రీనివాసరావు మమేకం కావడమే కాకుండా జిల్లాలో పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అన్ని మండలాల్లో పోలీసులు– మీ కోసం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలు, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో గుడుంబా, గుట్కా నియంత్రణపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో నేరాలు అరికట్టేందుకు ప్రధాన కూడళ్లు, కాలనీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కేసులను పరిష్కరించడంలో దోహదపడుతున్నాయి. సీసీ కెమెరాల సాయంతో గతేడాదితో తొమ్మిది కేసులు పరిష్కారమయ్యాయి. గతేడాది వివిధ కార్యక్రమాల్లో భాగంగా 746 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆసిఫాబాద్, కాగజ్నగర్ పోలీస్ సబ్ డివిజన్లలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో కొన్ని నెలలుగా కాలనీలు, బస్తీల్లో బ్లూకోల్ట్స్ తదితర సిబ్బంది పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. దొంగతనాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.
సేవా కార్యక్రమాలు సైతం..
పోలీసులు మీకోసం కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు సైబర్ సెక్యూరిటీ, రోడ్ సేఫ్టీ, గుడ్ టచ్– బ్యాడ్ టచ్, గంజాయి, ఆన్లైన్ మోసాలు, గుట్కా, మట్కా, జూదం, మహిళల భద్రత కమ్యూనిటీ పోలీసింగ్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళ భద్రత కోసం షీటీంలు ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇటీవల బెజ్జూర్ మండలం నాగవల్లిలో పేదలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, యువతకు వాలీబాల్, క్రికెట్ కిట్లు ఇచ్చారు. వైద్యశిబిరం నిర్వహించి మందులు పంపిణీ చేశారు. జైనూర్లో ఆదివాసీ మహిళలకు 35 కుట్టు మిషన్లు అందించారు.
రెబ్బెన మండలం గోండుగూడ, కాగజ్నగర్ డివిజన్లోని కనికి, తుమ్మిడిహెట్టి, తాటిపల్లి, సిర్పూర్(యూ) మండలం పవర్గూడ గ్రామాల్లోని ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గత నెల 12న జైనూర్లో ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. మార్చి 5న సిర్పూర్–యూ మండలం దుద్దేకాస గ్రామంలో సరుకులు, పండ్లు పంపిణీ చేశారు.
మార్చి 2న ఏఎస్పీ చిత్తరంజన్ తిర్యాణి మండలం గోవెన, కుర్సిగూడ, నాయకపుగూడ గ్రామాలకు కాలినడకన దాదాపు 20 కి.మీ. దూరం వెళ్లి ఆదివాసీల సమస్యలు తెలుసుకున్నారు. యువతకు వాలీబాల్ కిట్లు, స్పోర్ట్ టీషర్టులు పంపిణీ చేశారు.
మార్చి 24న కౌటాల పోలీస్ స్టేషన్లో మూడు రోజులపాటు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన జట్లకు నగదుతోపాటు బహుమతులు అందించారు. బోదంపల్లిలో నిరుపేద మహిళకు పోలీసులు నిర్మించిన ఇంటిని ప్రారంభించారు. తుమ్మిడిహెట్టి గ్రామంలో దుప్పట్లు, వైద్యశిబిరం నిర్వహించారు.

ప్రజలతో మమేకం.. సేవలకు ప్రాధాన్యం