
● నిషేధిత వస్తువుల రవాణాకు అడ్డాలుగా ట్రాన్స్పోర్టులు
నిఘా పెంచాం
ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలపై నిఘా పెంచాం. ఎస్పీ ఆదేశాల మేరకు నకిలీ పత్తి విత్తనాల సరఫరాపై ప్రధానంగా దృష్టి సారించాం. వీటితోపాటు అనుమతులు లేని నకిలీ వ్యవసాయ మందులు, ఉత్పత్తులు, గ్లైఫోసెట్ రౌండప్ మందులపైనా నిఘా ఉంటుంది. ఎవరైనా అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేస్తాం.
– రాణాప్రతాప్, టాస్క్ఫోర్స్ సీఐ,
కాగజ్నగర్
చింతలమానెపల్లి(సిర్పూర్): వివిధ ప్రాంతాల నుంచి వస్తువులు తరలించడానికి జిల్లాలో ట్రాన్స్పోర్టు కంపెనీలు తమ కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. వీటి ద్వారా పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలకు ని త్యం భారీఎత్తున సరుకులు చేరవేస్తున్నారు. కాగజ్నగర్ పట్టణంలో సుమారు 15 ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు, ఆసిఫాబాద్లో మరో 15 ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు ఉన్నాయి. ఇవే కాకుండా స్థానిక ట్రాన్స్పోర్ట్లు కూడా ఉన్నాయి.
సులువుగా సరుకు రవాణా
వస్తువులు, అనుమతి ఉన్న, ప్రజా అవసరాల సరుకులు రవాణా చేయడానికి ట్రాన్స్పోర్ట్ కార్యాలయాలు ఉపయోగపడుతున్నాయి. అలాగే అక్రమ వస్తువులు, అనుమతి లేని, నిషేధం ఉన్న వస్తువులు, సరుకులు కూడా గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ వాహనాలు, ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల ద్వారా నిత్యం గ్రామీణ ప్రాంతాలకు సరుకు ర వాణా జరుగుతోంది. వీటిని అనుకూలంగా మా ర్చుకున్న వ్యాపారులు తమకు కావాల్సిన సరుకును తరలించేందుకు ట్రాన్స్పోర్టులను వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఏటా జిల్లాలోకి వర్షాకా లం సీజన్కు ముందే జనవరి, ఫిబ్రవరి నుంచి జిల్లాలోకి నకిలీ పత్తి విత్తనాలు డంప్ చేసి రహస్య ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారా ష్ట్రకు చెందిన వ్యాపారులు ఈ ట్రాన్స్పోర్టులను విని యోగించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
నిఘా కరువు
ట్రాన్స్పోర్ట్ కంపెనీల వాహనాల ద్వారా తరలించే వస్తువులు, కార్యాలయాలపై నిఘా తక్కువగా ఉంటోంది. కార్యాలయాల నిర్వహణ, వాహనాల్లో స రుకు రవాణాకు ట్రాన్స్పోర్ట్ కంపెనీలు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటాయి. కానీ నిత్యం భారీ సంఖ్యలో తరలించే వస్తువులపై నిఘా ఏర్పా టు చేయడం ఆయా శాఖలకు తలకు మించిన భా రంగా మారింది. పోలీస్, విజిలెన్స్, ఎకై ్సజ్ శాఖలు మాత్రమే అడపాదడపా తనిఖీ చేపడుతున్నాయి. పూర్తిస్థాయి ప్యాకింగ్తో వచ్చే పార్సిళ్లను పరిశీలించడం సిబ్బందికి కష్టమవుతోంది. ఇది అక్రమంగా వస్తువులను తరలించి సొమ్ము చేసుకునే వారికి వరంగా మారుతోంది. నకిలీ విత్తనాలు, నిషేధిత మందులు, ట్యాక్స్లు చెల్లించని వస్తువులు ట్రాన్స్పోర్ట్ కంపెనీల ద్వారా తరలిస్తున్నారు. తద్వారా భారీగా ఆదాయం గడిస్తున్నారు. మరోవైపు మార్కెట్లో నిషేధిత వస్తువులు, నాణ్యత లేని సరుకు వినియోగిస్తూ సాధారణ ప్రజలు నష్టపోతున్నారు. కల్తీ వస్తువులు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. అవగాహన లేకపోవడంతో జిల్లాలోని గిరిజన ప్రజలు సులువుగా మోసపోతున్నారు.
పోలీసుశాఖ దృష్టి
వర్షాకాలం సీజన్కు ముందే ఇటీవల భారీగా నకిలీ విత్తనాలు సరఫరా కావడం కలకలం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారంతో ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలోనూ నిషేధిత విత్తనాలు పట్టుబడడంతో పోలీసుశాఖ అప్రమత్తమైంది. ట్రాన్స్పోర్ట్ కంపెనీల కార్యకలాపాలపై దృష్టి సారించింది. కాగజ్నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో వ్యవసాయ, పోలీసు శాఖల అధికారులు ఇటీవల తనిఖీ లు చేపట్టారు. ప్రధానంగా నకిలీ విత్తనాలు జిల్లాలోని మార్కెట్లను ముంచెత్తే అవకాశం ఉన్నందున ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. చెక్పోస్టులను బలోపేతం చేయడంతోపాటు ట్రాన్స్పోర్టు కంపెనీలపై నిఘా ఉంచితే నిషేధిత విత్తనాలు, పురుగు మందులు, ట్యాక్స్ లేని వస్తువులు, సరుకుల దిగుమతిని పకడ్బందీగా అడ్డుకోవచ్చు.
కాగజ్నగర్లోని ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ద్వారా నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయనే సమాచారంతో టాస్క్ఫోర్స్ అధికారులు ఈ నెల 9న తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 45 కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. బెజ్జూర్ మండలానికి చెందిన ఓ వ్యక్తి పేరు మీద విత్తనాల సంచి వచ్చినట్లు గుర్తించారు. పట్టుబడిన విత్తనాల విలువ రూ.1,57,500 ఉంటుందని అధికారులు తెలిపారు... ఇలా పలు ట్రాన్స్పోర్టుల ద్వారా జిల్లాలోకి అక్రమంగా నకిలీ విత్తనాలు, ట్యాక్స్ లేని వస్తువులు సరఫరా అవుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

● నిషేధిత వస్తువుల రవాణాకు అడ్డాలుగా ట్రాన్స్పోర్టులు