
నిరంతర సాధనతో ఉత్తమ ఫలితాలు
రెబ్బెన(ఆసిఫాబాద్): నిరంతర సాధనతో పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్రెడ్డి అన్నారు. గోలేటి టౌన్షిప్లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఉచిత పాలిసెట్ కోచింగ్ సెంటర్ను శుక్రవారం ప్రారంభించారు. జీఎం మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యంతో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. శ్రీరాంపూర్లోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులకు మెరుగైన కొలువులు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఏరియాలోని విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరేందుకు ఉచితంగా పాలిసెట్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రెడ్డిమల్ల తిరుపతి, ప్రధానోపాధ్యాయుడు రవితేజ, ఉపాధ్యాయుడు ఆర్లారెడ్డి, పీఈటీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.