మోసాలు చేసి ఎమ్మెల్యేపై విమర్శలా!
బెల్లంపల్లి: రైతులను మోసం చేసి జైలుకు వెళ్లిన ఆరిజిన్ డెయిరీ నిర్వాహకులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై తప్పుడు ఆరోపణలు చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నారని బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్.సత్యనారాయణ, సీనియర్ నాయకుడు గెల్లి రాజలింగు పేర్కొన్నారు. మంగళవారం పద్మశాలీ భవన్లో వారు విలేకరులతో మాట్లాడారు. ఆరిజిన్ డెయిరీ ఏర్పాటు చేసి రైతులను నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1.50 లక్షల నుంచి రూ.3.50 లక్షలలోపు వసూలు చేశారని ఆరోపించారు. రైతులకు పాడి గేదెలు ఇవ్వకుండా మోసం చేసినందుకే పోలీసులు నిర్వాహకులను అరెస్ట్ చేశారని తెలిపారు. ఆరిజిన్ డెయిరీ నిర్వాహకుడు కందిమళ్ల ఆదినారాయణ, ఓ మహిళపై ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల పోలీస్స్టేషన్లలో రైతులను మోసం చేసిన కేసులు నమోదయ్యాయని వివరించారు. ఆరిజిన్ డెయిరీ నిర్వాహకులు, మరికొందరు కల్పితాలతో ఆడియో, వీడియో టేపుల ద్వారా ఎమ్మెల్యేపై సోషల్ మీడియాలో అసత్యప్రచారం చేసి ఆనందపడుతున్నారని తెలిపారు. ఎమ్మెల్యే చిన్నయ్యపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. తప్పుడు ఆరోపణలు మానుకోకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు బొడ్డు నారాయణ, మున్సిపల్ కౌన్సిలర్లు నెల్లి శ్రీలత, తడక పద్మావతి, తుంగపల్లి సుజాత, దామెర శ్రీనివాస్, రాములునాయక్, సోమగూడెం సర్పంచ్ ప్రమీలగౌడ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు ఏలూరి వెంకటేశ్, మాజీ కౌన్సిలర్లు జిలకర వాసు, రేవెల్లి విజ య్కుమార్, ఎలిగేటి శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల బాధ్యులున్నారు.
డెయిరీ నిర్వాహకులపై బీఆర్ఎస్ ఆగ్రహం
ఆరోపణలు అవాస్తవమన్న నేతలు