చివరి విడత కోసం..
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, పురోగతి
కంటి నిండా
నిద్రపోతున్నాం..
మార్చి వరకు పూర్తయిన ఇళ్లకు చెల్లింపు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు చివరి బిల్లు అందుతోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ(పీఎంఏవైజీ) పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.72 వేల చొప్పున విడుదల కావాల్సి ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లు వచ్చాక మరో రూ.28 వేలు కలిపి ఇవ్వాలని భావించింది. కానీ కేంద్రం నుంచి ఎంతకూ స్పందన లేకపోవడంతో చివరకు రాష్ట్ర ప్రభుత్వమే చివరి విడత బిల్లును మంజూరు చేసింది. దీంతో జిల్లాలో ఈ ఏడాది మార్చి 31నాటికి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న 1,689 ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో రూ.లక్ష చొప్పున రూ.16.89 కోట్లు జమ అయ్యాయి. మార్చి తర్వాత నుంచి ఇప్పటి వరకు నిర్మాణాలు పూర్తయిన ఇళ్లకు కూడా బిల్లులు చెల్లించేందుకు గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తోంది.
సత్తుపల్లిలో అత్యధికం
జిల్లాకు రూ.16,495 ఇళ్లు మంజూరు కాగా.. అత్యధికంగా 522 ఇళ్లను పూర్తి చేసి సత్తుపల్లి నియోజకవర్గం మొదటి స్థానాన నిలిచింది. ఇక్కడ మొత్తం 3,416 ఇళ్లు మంజూరు కాగా 2,092 ఇళ్ల పనులు చివరి దశకు చేరగా 522 ఇళ్ల గృహప్రవేశాలు జరిగాయి. ఇక పాలేరు నియోజకవర్గంలో 2,146 ఇళ్లు స్లాబ్ స్థాయికి చేరగా మొత్తం 3,421 ఇళ్లలో 415 నిర్మాణాలు పూర్తయ్యాయి. మధిర నియోజకవర్గంలో 2,719 ఇళ్లు మంజూరు కాగా, 1,828 ఇళ్లు స్లాబ్, 238 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వైరా నియోజకవర్గంలో 2,927 ఇళ్లకు గాను 1,619 స్లాబ్ స్థాయికి చేరగా, 305 గృహప్రవేశాలు జరిగాయి. ఖమ్మం నియోజకవర్గంలో 3,351 ఇళ్లకు గాను 1,405 స్లాబ్ పూర్తి కాగా, 166 ఇళ్ల నిర్మాణం జరిగింది. ఇల్లెందు నియోజకవర్గ పరిధి కామేపల్లి మండలంలో 661ఇళ్లకు 288 ఇళ్ల స్లాబ్ పనులు పూర్తి కాగా, 43 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.
ఎల్–3 లబ్ధిదారులకు ఊరట
గతంలో ఇళ్లు మంజూరైన పలువురికి ప్రొసీడింగ్స్ ఇవ్వగా పునాదులు, ఆ పైన నిర్మాణాలు పూర్తి చేశారు. కానీ ఇందులో కొందరికి వాహనాలు ఉన్నాయని, ఏళ్ల క్రితం ఇళ్లు మంజూరయ్యాయనే కారణంతో దాదాపు 150 మందిని ఎల్3 జాబితాలో చేర్చారు. అంతేకాక బిల్లులు నిలిపివేశారు. ఈ అంశంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో బిల్లులు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే జీఓ విడుదల కానుంది.
ఈ ఏడాది మార్చి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తయిన 1,689 ఇళ్ల లబ్ధిదారులకు రూ.లక్ష చొప్పున చివరి విడత బిల్లు జమ అయింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు కూడా బిల్లులు అందజేసేందుకు కసరత్తు చేస్తున్నాం. ఇక ఎల్–3 జాబితాలో ఉన్న 150 మందికి సైతం బిల్లులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక ప్రొసీడింగ్స్ ఇచ్చి వారు ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించారు.
– భూక్యా శ్రీనివాస్, పీడీ, గృహనిర్మాణ శాఖ
ఇందిరమ్మ ఇళ్లకు విడతల వారీగా నిధులు మంజూరవుతాయి. బేస్మెంట్ స్థాయిలో రూ.లక్ష, రూఫ్ లెవల్ నిర్మాణం జరిగాక ఇంకో రూ.లక్ష, స్లాబ్ స్థాయిలో రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయ్యాక రూ.లక్ష అందజేస్తారు. అయితే, లబ్ధిదారులకు మూడు విడతల్లో రూ.4 లక్షలు అందినా, చివరి విడత రూ.లక్ష విషయంలో జాప్యం జరిగింది. కేంద్రం నుంచి నిధుల మంజూరు ఆలస్యం జరగడంతో లబ్ధిదారులు నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చింది.
మంజూరైన ఇళ్లు 16,495
నిర్మాణాలు ప్రారంభం కానివి 1,953
మార్కింగ్ చేసినవి 601
పునాదులు పూర్తయినవి 1,551
గోడలు పూర్తయినవి 1,323
స్లాబ్ వేసినవి 9,378
నిర్మాణం పూర్తయిన గృహాలు 1,689
మొన్నటి వరకు పూరి గుడిసెలో జీవనం సాగింది. చిన్న వర్షం వచ్చినా ఇల్లంతా నీటితో కునుకు పట్టేది కాదు. ఎట్టకేలకు మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా నిర్మాణం పూర్తిచేశాం. ఇప్పుడు సొంతింట్లో కంటి నిండా నిద్ర పోతుండగా.. చివరి విడత బిల్లు కూడా రావడంతో కష్టాలు తీరాయి.
– షేక్ ఖురేషా, కోరట్లగూడెం,
నేలకొండపల్లి మండలం
ఇందిరమ్మ లబ్ధిదారుల ఖాతాలో ఆఖరి రూ.లక్ష
జిల్లాలో 1,689మందికి రూ.16.89 కోట్లు


